ముందస్తుకు కాంగ్రెసు కసరత్తు?, వేడెక్కుతున్న హస్తిన
అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిస్తున్న సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిపై ఎక్కువకాలం ఆధారపడటం మంచిది కాదని భావిస్తోన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. ములాయం సింగ్ లోకసభ అభ్యర్థులను ప్రకటించడం కూడా ఎన్నికల వాతావరణాన్ని తెచ్చి పెట్టిందని అంటున్నారు.సోనియా గాంధీ త్వరలోనే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా ప్రకటించవచ్చుననే మాట వినిపిస్తోంది.
రాహుల్ గాంధీకి త్వరలోనే అతిపెద్ద బాధ్యత అప్పగించనున్నట్టు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటించటం గమనార్హం. కాంగ్రెస్ను ముందస్తు ఎన్నికలకు సిద్ధపరిచేందుకే ఆమె తన కుమారుడు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నాయకత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిందని అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా దాదాపు పద్దెనిమిది నెలల సమయం ఉండగానే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటంతోపాటు వాటికి అనుబంధంగా పొత్తుల కమిటీ, ఎన్నికల ప్రణాళికా కమిటీ, ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేయటం వెనక ఉన్న రహస్యం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు.
వచ్చే ఏడాది నవంబర్ - డిసెంబర్ నెలల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, ఢిల్లీ శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆదే సమయంలో లోకసభ ఎన్నికలకు వెళ్లాలనే యోచన కాంగ్రెసులో జరుగుతున్నట్లు చెబుతున్నారు. పరిస్థితిని వివిధ రాష్ట్రాల్లో అంచనా వేయడానికి పార్టీ ఇప్పటికే 44 మంది పరిశీలకులను రంగంలోకి దింపింది. రానున్న కాలంలో మరింత మంది పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.
కాంగ్రెసు పరిస్థితి ఏమీ బాగా లేదని, ఎక్కువ సంఖ్యలో ఎంపిలను అందించిన రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ లాగే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయాయని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. నష్టాలను తగ్గించుకోవడానికి కాంగ్రెసు మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చునని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కాంగ్రెసు అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. అయితే, మధ్యంతర ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వ మనుగడకు వచ్చిన ప్రమాదమేమీ లేదని ఆయన అన్నారు.