షర్మిల భయం: జగన్ జైల్లో ఉన్నా ఆగని దూకుడు
వైయస్ జగన్ను సిబిఐ మే 27వ తేదీన అరెస్టు చేసింది. ఆయన గత 175 రోజుల పాటు జైలులోనే ఉన్నారు. అయినా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి దూకడం తగ్గలేదు. పైగా ఇటీవలి కాలంలో పెరిగినట్లు కనిపిస్తున్నాయి. షర్మిల ఓ వైపు పాదయాత్ర సాగిస్తుండగా, వైవి సుబ్బారెడ్డి వంటి నాయకులు ఇతర పార్టీల శాసనసభ్యులు రహస్య మంతనాలు జరుపుతూ పార్టీలోకి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి కూడా వలసలు జరుగుతున్నప్పటికీ తాజాగా ఆ పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు భయం పట్టుకున్నట్లే ఉంది. షర్మిల తెలంగాణలో పాదయాత్ర జరిపే సమయంలో ఆ పార్టీలోకి వలసలు పెరుగుతాయనే వాతావరణం నెలకొని ఉంది. మాజీ శాసనసభ్యులు, ఇతర నాయకులు పార్టీలో చేరుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని అధికారికంగా తమ పార్టీలో చేర్చుకునే పనికి మాత్రమే పరిమితమవుతున్నారు.
షర్మిల ఇప్పటి వరకు 430 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన హవాను కనసాగించడానికి తెర వెనక ఉండి పనిచేస్తున్నదంతా సజ్జల రామకృష్ణారెడ్డి అనే మాట వినిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైయస్ జగన్ను ప్రజలు అంగీకరించడం పార్టీకి బలాన్ని ఇస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల వల్ల లాభపడిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. దాంతో జగన్కు మద్దతు లభిస్తోందని అంటున్నారు.