జగన్ ఫ్యాక్టర్: సిఎంతో కార్పోరేటర్లతో కలిసి దానం భేటీ
తమ కార్పోరేటర్లు ఎవరూ పార్టీని వీడబోరని భేటీ అనంతరం దానం నాగేందర్ చెప్పారు. ఎప్పటికైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ పార్టీలో కలవాల్సిందేనని ఆయన అన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు, మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ నెల 3,4,5 తేదీల్లో ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ బాట చేపట్టనున్నారు.
తమ పార్టీ శాసనసభ్యులు ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లరని రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి ప్రసాద్ అన్నారు. కాంగ్రెసుక 120 ఏళ్ల చరిత్ర ఉందని, ఇటువంటి పార్టీని తమ శాసనసభ్యులు వీడుతారనేది నిజం కాదని ఆయన అన్నారు. ఇదిలావుంటే, శాసనసభ్యుడు కూన శ్రీశైలం ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కూడా శ్రీశైలం వెంట ఉన్నారు.
తాను పార్టీని వీడుతున్నట్లు మీడియాలోనే వార్తలు వస్తున్నాయని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎవరికీ చెప్పలేదని అన్నారు. తాను కాంగ్రెసును వీడబోనని స్పష్టం చేశారు. కూన శ్రీశైలం గౌడ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మజ్లీస్ తమ పార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన పలువురు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన శాసనసభ్యులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.