ఆయనే లీక్ చేశారు: ఢిల్లీ నేతల వద్ద బొత్స ఆవేదన
గురువారం పార్లమెంటు సెంట్రల్ హాలులో బొత్స సత్యనారాయణ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని ఆయన కలిశారు. కొద్ది సేపు మంతనాలు జరిపారు. ఇదే సమయంలో కిశోర్ చంద్రదేవ్ ఆరోపణలపై తోటి నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నోట్ ఆయనే ప్రెస్కు లీక్ చేసినట్లు తనకు ఆధారాలు లభించాయని చెప్పినట్టు సమాచారం. అనవసరంగా కిశోర్ చంద్రదేవ్ తన జోలికి వచ్చారని బొత్స కాస్త ఆగ్రహించారు.
కిషోర్ మీద ఎదురుదాడి చేయగల సత్తా తనకు ఉందని, అయితే తాను ఇతరులను పురికొల్పబోనని, పిసిసి అధ్యక్షుడిగా ఉండి అలా చేయడం మంచిది కాదని ఊరుకున్నానని ఆయన చెప్పారు. కాగా, అధిష్ఠానానికి అన్నీ వివరించాలని ఆయన యోచిస్తున్నారు.
2జీ స్కాంపై విచారణకు నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీలో రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి చోటు లభించింది. ఈ మేరకు గురువారం ఆయనను ఏఐసీసీ నామినేట్ చేసింది. మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశాల సమయంలో ప్రతిపక్షాలపై ఉండవల్లి విరుచుకుపడేవారు. ఈ అనుభవమే తాజా కమిటీలో అవకాశం కల్పించింది.