ధర్మానకు ప్రాసిక్యూషన్కు నో: సిఎంకు డిఎల్ ప్రశ్న
ధర్మాన రాజీనామా ఆమోదాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టడాన్ని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని, దాన్ని మంత్రి వర్గ సమావేశంలో ఎందుకు పెట్టారని అన్నట్లు తెలుస్తోంది. డిఎల్ రవీంద్రా రెడ్డికి సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి సర్ది చెప్పగా, దానిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈ నెల 29వ తేదీన మంత్రివర్గం మరోసారి సమావేశమై ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. పెట్టుబడి రాయితీపై కూడా అదే రోజు నిర్ణయం తీసుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్కె త్యాగి ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించింది. ఈ ప్రమాం వెనక ఏ విధమైన కుట్ర లేదని త్యాగి కమిటీ తేల్చింది.
ప్రభుత్వ ఉద్యోగుల డిఎ పెంపు, స్విమ్స్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లో దాదాపు 11 వేల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఐదుగురు మంత్రులు వివిధ కారణాల వల్ల మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాలేదు. గీతారెడ్డి, గల్లా అరుణకుమారి, గంటా శ్రీనివాస రావు, రఘు వీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు మంత్రివర్గ సమావేశానికి గైర్హాజయ్యారు. గంటా శ్రీనివాస రావు కాలికి గాయమై చికిత్స తీసుకుంటుండగా, రఘువీరా రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.