ప్రభుత్వంతో కావూరి ఢీ, ఇక ప్రతిపక్షపాత్ర: ఏ పార్టీలోకి?
ఈ సందర్భంగా పలువురు కొల్లేరు సమస్యను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ... నెల రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు ఈ సమస్యను తాను పెట్టిన గడువులోగా తీర్చని పక్షంలో ఏలూరులో మహాధర్నా చేపడతానని హెచ్చరించారు. కావూరి ఈ ప్రకటన ద్వారా ఆయన స్వరం క్రమంగా మారుతోందని అంటున్నారు.
ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఆయనకు అధిష్టానం మొండి చేయి చూపడంతో ఆయన అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నచ్చజెప్పినప్పటికీ ఆయన అసంతృప్తి చల్లారలేదు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మీడియా ఈ విషయంపై అడిగితే కూడా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
అధిష్టానం కూడా అతను పార్టీ మారుతాడనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అతను ఏ పార్టీలో చేరుతారనే విషయమై పెదవి విప్పక పోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే చేరతారా ఇంకా ఏదైనా పార్టీలో చేరతారా అనే ప్రశ్న పలువురుని తొలుస్తోంది. అయితే జగన్ పార్టీ మినహా మరో పార్టీలో ఆయన చేరే అవకాశాలు లేవని అంటున్నారు.