షూటింగ్ షెడ్డులో అగ్నిప్రమాదం: ఆరుగురు మృతి
మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. పుప్పాల్గూడ, సెక్రటేరియట్ కాలనీలోని ఐదంతస్థుల బాబా నివాస్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఓ టీవీ సీరియల్ షూటింగ్ కోసం 20 గుడిసెలను, ఓ పెద్ద షెడ్డును వేశారు. ఆదివారం సాయంత్రం ఓ గుడిసెలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మిగిలిన గుడిసెలకు అంటుకోవడంతో పాటు క్షణాల్లో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోకి వ్యాపించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిమ్మచీకటిలో హాహాకారాలు హోరెత్తాయి.
అందరూ ఒక్కసారిగా మెట్ల గుండా వస్తుండటంతో తొక్కిసలాట జరిగింది. అప్పటికే మంటలు అపార్ట్మెంట్ను పూర్తిగా ఆక్రమించుకున్నాయి. విషయం తెలియగానే హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, కలెక్టర్ వాణీప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అపార్ట్మెంట్లో చిక్కుపోయిన వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అనేక విధాలుగాప్రయత్నించారు. లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో భవనంలోని ఫ్లాట్లకున్న అద్దాలను పగులగొట్టారు. మొదటి, రెండో అంతస్థుల్లో ఉన్న వారిని రక్షించి కిందకు తీసుకొచ్చి అక్కడే ఉన్న అంబులెన్స్లోకి ఎక్కించారు. వాటిలో ప్రాణవాయువు లేకపోవడంతో బాధితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణవాయువు మాస్క్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు సమస్య ఎదురైంది.
అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరిపిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చిన అరగంటకుకూడా అగ్నిమాపక శకటాలు రాలేదని స్థానికులు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా జీహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనేకమంది సజీవ దహనమయ్యారని అన్నారు. హోంమంత్రి స్పందిస్తూ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని, అగ్నిమాపక శకటాలు ఆలస్యంగా రావడంపై కూడా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.