ప్రాంతీయ పార్టీలు: ఫ్యామిలీలదే ఆధిపత్యం ఇలా..
హైదరాబాద్: సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యులదే ఆధిపత్యం ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అధినేతల కుటుంబ సభ్యులు పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. కార్యకర్తలు కూడా వారి చుట్టే తిరుగుతుంటారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అందుకు ఆంధ్రప్రదేశ్ మినహాయింపు ఏమీ కాదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్కు పార్టీ పదవి ఏమీ లేదు. కానీ చంద్రబాబు వారసుడిగా ముందుకు వస్తారనే ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యవహారాల్లో ఆయనది పైచేయిగానే ఉంటుంది.
బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమారుడు, చంద్రబాబు నాయుడి బావమరిది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆయన ఆధిపత్యం నడుస్తుంది. పార్టీ నిర్ణయాలను, వ్యవహారాలను ఆయన ప్రభావితం చేయగలరు.
హరికృష్ణ కూడా పార్టీలో ముఖ్యమైన పాత్రధారే. చంద్రబాబు తర్వాతి గౌరవం ఇప్పటి వరకు ఆయన పొందుతూ వచ్చారు. ఆయన అలిగితే వార్త. పార్టీలో ఆయన పలుకుబడి కొనసాగుతూ ఉంటుంది. అవసరమనుకుంటే చంద్రబాబు దానికి చెక్ పెట్టవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ యువకుడే అయినా పార్టీకి ముఖ్యమైన నాయకుడు. చంద్రబాబుపై అలిగి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ప్రచారం సాగించారు. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులైనా సరే ఈ యువ హీరో పక్కన రెండో స్థాయి నాయకుడిగా నిలబడాల్సిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులదనే విషయం వేరుగా చెప్పాల్సిన పని లేదు. తెర వెనక వైయస్ జగన్ కుటుంబ సభ్యులు కొంత మంది పనిచేస్తుంటే తెర ముందు మరి కొంత మంది పనిచేస్తున్నారు. వైయస్ జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో వైయస్ విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
షర్మిలకు పార్టీలో ఏ పదవీ లేదు. కానీ, ఇప్పుడు తెర ముందు ప్రధాన నాయకురాలు ఆమెనే. జగన్ జైలులో ఉన్న నేపథ్యంలో ప్రజల ముందు కనిపించే నేత షర్మిల. ఆమె పాదయాత్ర ఓ ప్రాంతీయ పార్టీ అధినేతను తలపించే రీతిలో సాగుతోంది. జగన్ స్థానంలో ఆమె తెర ముందు కనిపిస్తున్నారు.
తెరాస ఉద్యమ పార్టీ అయినా కెసిఆర్ కుటుంబ సభ్యులదే హవా. తెరాస మేనల్లుడు హరీష్ రావు మొదటి నుంచీ పార్టీలో ప్రధాన భూమికను పోషిస్తున్నారు. ఆయన మాటకు కెసిఆర్ చెప్తే తప్ప తిరుగు ఉండదు. పార్టీలో సీనియర్ నాయకులు కూడా ఆయన వెంట నడవాల్సిందే.
కెటి రామారావు కెసిఆర్ కుమారుడు. ఆయన మధ్యలో విదేశాల నుంచి పార్టీలో చేరారు. వెంటనే సిరిసిల్ల నుంచి పోటీ చేసి శాసనసభ్యుడయ్యారు. ఆయన చుట్టూ ఎప్పటికీ ఓ బలగం ఉంటుంది. కెసిఆర్ తర్వాతి స్థానం ఆయనదే అంటారు.
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు. పార్టీలో ఆమెకు ఏ పదవీ లేదు. నిజానికి, కుటుంబ సభ్యుల ప్రాబల్యమనే విమర్శలు వస్తాయని ఆమెను పార్టీలోకి తీసుకోలేదని అంటారు. దాంతో ఆమె తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసి, తన చుట్టూ బలమైన బలగాన్ని తయారు చేసుకున్నారు.
రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు, వైయస్ రాజశేఖర రెడ్డి భాషలో ఓ ఉప ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రాంతీయ పార్టీలయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉప ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులే ఈ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
అలాగే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుటుంబ సభ్యులదే ముఖ్య భూమిక. కెసిఆర్ నాయకత్వంలోని తెరాసలో కూడా అదే పరిస్థితి. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ పరిస్థితి తప్పదు. అధినేతల కుటుంబ సభ్యులకు పార్టీ పదవులు ఉండాల్సిన అవసరం లేదు. పదవులు లేకున్నా వారి మాటకు, చేతలకు ప్రాధాన్యం ఉంటుంది.