చిరు పార్టీ పెట్టినా వెళ్లలేదు, జగన్ చేస్తాడు: ఉమ్మారెడ్డి
స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో సామాజిక న్యాయం ఉండేదని, ఇప్పుడు అది కానరావడం లేదని ఉమ్మారెడ్డి అన్నారు. తాను కార్యకర్తల అభీష్టం మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. లోటస్ పాండులో విజయమ్మ సమక్షంలోతాను పార్టీలో చేరానన్నారు. పరువు, గౌరవం పదవుల కంటే చాలా ముఖ్యమన్నారు.
ఆ రెండు కొరవడినందునే తాను టిడిపిని వీడేందుకు నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలో తమ సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత లేద్నారు. చిరంజీవి వంటి ఆప్తుడు పార్టీ పెట్టినా వెళ్లని తాను గౌరవం దక్కక పోవడం, సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాలతో తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వస్తున్నానని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు ప్రజల్లో వేళ్లూనుకుపోయాయన్నారు.
ఆ పథకాలకు జగన్ సరైన న్యాయం చేస్తాడని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. జగన్ వల్లే న్యాయం జరుగుతుందన్నారు. టిడిపి కోసం తాను అవిశ్రాంత పోరాటం చేశానని చెప్పారు. పార్టీని విడిచి వెళ్లాల్సి వస్తుందనుకోలేదన్నారు. నేతలు పార్టీని విడిచి ఎందుకు వెళ్తున్నారో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల్లో కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కయిందన్నారు.