అవినీతి సొమ్ముతో టివి పెట్టి: కెసిఆర్, జగన్పై బాబు
చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ ఈగలు ఉంటాయని, ఇప్పుడు అంతా డబ్బు మాయ అన్నారు. టిడిపిని 42 ఎంపీ స్థానాల్లో, అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పారు. ఎస్సీ నిధుల మళ్లింపు పాపం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు. వైయస్ తన హయాంలో రాష్ట్రాన్ని దోచాడన్నారు.
కాంగ్రెసు పార్టీ నేతలు రాష్ట్ర ఖజానాను లూటీ చేశారన్నారు. వైయస్ జగన్ అవినీతి సొమ్ముతో సాక్షి టివి, ఛానల్ పెట్టాడన్నారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని ఇక్కడి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. కెసిఆర్ కూడా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టివి పెట్టారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలు రాసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అలాంటివారు తమనేమీ చేయలేరని హెచ్చరించారు.
కెసిఆర్ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రంలో కెసిఆర్ మంత్రిగా చేసినా, ఆయన పార్టీ నేతలు రాష్ట్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం ప్రధాని పదవినే వదులుకున్నానని, గుజ్రాల్ను ప్రధాన మంత్రి చేసింది తానేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు.