జగన్ని సిఎం చేసే స్థితి లేదు, స్కీంలుమావే: రాయపాటి
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్కు సిఎం పదవి ఇచ్చే అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణలు 2014 వరకు కొనసాగుతారన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి నాయకత్వ మార్పులుండవన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతుందన్నారు. కాంగ్రెసు పార్టీలోకి కొందరు నేతలు ఇతర పార్టీల నుండి వస్తున్నట్లుగా సమాచారముందని చెప్పారు.
కాంగ్రెసు పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. పార్టీలోకి రమ్మనడానికి, పొమ్మనడానికి ఏ పార్టీ నాయకుడుకు అధికారం, హక్కు లేవన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, గతంలో ప్రవేశ పెట్టిన పథకాలు... ఏవైనా కాంగ్రెసు పథకాలే అన్నారు. పథకాలు ఏ ఒక్క నేతకో సొంతం కావన్నారు.
కొందరు నేతలు డబ్బులిచ్చి తమ పాదయాత్రలకు జనాన్ని తరలిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల మరో ప్రజా ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రను ఉద్దేశించి అన్నారు. కొత్త పార్టీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు.