మోపిదేవితో జగన్ మాటామంతి: ధర్మానతో దూరం
చంచల్ గూడ జైలు నుండి జగన్ బయటకు వచ్చే సమయంలో చిరునవ్వుతో అందరికీ అభివాదం చేశారు. అనంతరం కోర్టుకు వచ్చి అక్కడ కనిపించిన వారందరినీ పలకరించారు. ఆయన కంటే ముందే చేరుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను, ఇతరులను నవ్వుతూ పలకరించారు. మోపిదేవితో కరచాలనం చేశారు. అయితే మంత్రి ధర్మాన ప్రసాద రావుతో మాత్రం ఎడమొహం పెడమొహంగా కనిపించారు. అయితే గతంలో వచ్చినప్పుడు ధర్మానతో మాట్లాడటం గమనార్హం. అధికారి శ్యామ్యూల్తో రహస్యంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
అనంతరం కుటుంబ సభ్యులతో, విజయ సాయి రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత జైలు అధికారులు జగన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కేసు విచారణ పూర్తి కాగానే జైలుకు తరలించారు. జగన్ తిరిగి జైలుకు చేరే వరకు రహదారి పూర్తిగా ఖాకీ మయమైంది.
మరోవైపు జగన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ జగన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లారు.