మళ్లీ 'బెజ.. బెజవాడ': వంశీపై కెమెరాలతో నిఘా

గుణదలలో పట్టు కోసం వంశీ, దేవినేని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వంశీ ఒకటో డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఓ వ్యక్తి రహస్యంగా వంశీ, ఆయన అనుచరుల కదలికలపై వీడియో తీశారట. వంశీయే స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. వంశీ, ఆయన అనుచరుల ఉనికిని పసిగట్టేందుకే దేవినేని ఈ వీడియోలు రహస్యంగా తీయించి ఉంటారని వంశీ వర్గం ఆరోపిస్తోంది.
కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రయివేటు వ్యక్తులు తీయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అతను సందేహంగా వీడియో తీస్తుండటంతో వంశీ అనుచరులే పట్టుకొని ప్రశ్నించారు. పోలీసులు తీయమని చెప్పారని చెప్పాడు. పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. దీంతో దేవినేనిపై వంశీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూ తనను హత్య చేయించేందుకు తన కదలికలపై నిఘా పెట్టి వీడియోలు తీయిస్తున్నాడని వంశీ ఆరోపిస్తున్నారు.
ఓ అపరిచత వ్యక్తి వచ్చి సందేహాస్పదంగా వీడియో తీయడం కనిపించిందని, తాము ఎటు వెళితే అటు ఆయన వస్తున్నారని, దీంతో అతనిని పట్టుకొని ప్రశ్నించామని, అరవ సత్యం తీయమని చెప్పాడని వంశీ అన్నారు. మొదట అతను మామూలుగా వీడియో వాళ్లలో కలిసిపోవడంతో గుర్తించలేదని, ఆ తర్వాత అనుమానాస్పదంగా కనిపించారని చెప్పారు. దీనిపై వంశీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.












Click it and Unblock the Notifications