పురంధేశ్వరి చాటు మనిషి: దగ్గుబాటిపై కెఇ వ్యాఖ్య

మంగళవారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. దగ్గుబాటిని దుయ్యబట్టారు. చంద్రబాబు అంటే దగ్గుబాటికి మొదటి నుంచి ఈర్ష్య, కుళ్లు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంత్రిగా, తెలుగుదేశం అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నప్పుడే చంద్రబాబును చూసి దగ్గుబాటి అసూయ పడేవారని ఆయన అన్నారు.
పార్లమెంట్లో దివంగత నేత ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి రాసిన లేఖలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. విషయాలను పురంధేశ్వరి వక్రీకరించారని ఆయన అన్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన తెచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. తర్వాత పార్టీ ఎంపీల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్న తరుణంలో దురదృష్ట వశాత్తు తమ అధికారం కోల్పోయిందని, అంతే తప్ప విగ్రహ ఏర్పాటులో తమ పార్టీ ప్రయత్నలోపమేదీ లేదని ఆయన వివరించారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇచ్చేది తెలుగుదేశం పార్టీ కాదనీ, ఎన్టీఆర్ కూతురుగా తాను విగ్రహం ఇస్తానంటూ పురందేశ్వరి విగ్రహ ఏర్పాటుకు అడ్డుపుల్ల వేశారని ఆయన విమర్సించారు. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ చెప్పినట్లు పురందేశ్వరి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జీవించి ఉంటే పురందేశ్వరి కాంగ్రెస్లో చేరేవారా అని కెఇ కృష్ణమూర్తి ప్రశ్నించారు. మంత్రి పదవికి కక్కుర్తి పడి సోనియా చెప్పినట్లు వినడం ఎంత వరకు సమంజసమని ఆయన పురంధేశ్వరిని ప్రశ్నించారు.
ఇదిలావుంటే, విగ్రహ విషయాన్ని కుటుంబ వ్యవహారం చేసి దగ్గుబాటి దంపతులు రాజకీయం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అరోపించారు. ఇది పూర్తిగా తమ పార్టీ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని, అలాంటిది దగ్గుబాటి దంపతులు కావాలని అడ్డుకుని, ఇప్పుడు పచ్చి అబద్ధాలాడుతూ తమ అధినేతను విమర్శిస్తున్నారని ఆయన మంగళవారం హైదరాబాదులో అన్నారు. కుటుంబ సభ్యులంతా సంతకాలు పెట్టిన లేఖతో బాలకృష్ణ వారి ఇంటికి వెళ్లారని, అప్పుడే సంతకం పెడితే విగ్రహం ఏర్పాటుకు ఇంత ఆలస్యమయ్యేది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications