తెలుగుతల్లి దెయ్యం, భేటీ చిల్లర నాటకం: కెసిఆర్
తెలుగుతల్లి ఓడిలోకి చేరుతురా, అధిష్టానానికి గులామీ చేస్తారా తేల్చుకోవాలని ఆయన కాంగ్రెసు తెలంగాణ ఎంపీలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన తలపెట్టిన అఖిల పక్ష సమావేశాన్ని ఆనయ చిల్లర నాటకంగా అభివర్ణించారు. పార్టీకి ఇద్దరిని రమ్మంటారా, ఇదేనా కాంగ్రెసు కాంగ్రెసు చిత్తశుద్ధి, తామేమైనా ఎడ్డోళ్లమా, అంత అర్థం కాదా తమకు అని ఆయన అడిగారు. ఢిల్లీలో ఏం పట్టుకుని ఊగులాడుతారని, బయటకు రావాలని ఆయన కాంగ్రెసు తెలంగాణ ఎంపీలకు పిలుపునిచ్చారు.
కేవీ రంగారెడ్డి వంటి మహనీయుల విగ్రహాలు లేకపోవడం దురదృష్టకరమని, మనకు సంబంధం లేని సన్నాసుల విగ్రహాలు హైదరాబాద్లో చాలా ఉన్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రంగారెడ్డి స్వగ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణ పది జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి జయంతి, వ ర్థంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. కెవి రంగారెడ్డి పేరుతో ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రం సాధించకుండా ఉద్యమాన్ని పొరపాటునైనా ఆపేస్తే సీమాంధ్ర పాలకులు మనల్ని బతకనివ్వరని అన్నారు. ఏదో లోయలో పడి నలబై మంది విద్యార్థులు మృత్యువాత పడితే వారికి నివాళి అర్పించే పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు నివాళి అర్పించరని ప్రశించారు.
తెలంగాణపై పార్లమెంట్లో చప్రాసీకి ఉన్న సోయి దేశ ప్రధానికి లేకుండా పోయిందన్నారు. ఆరు, పది ఎంపీ సీట్లున్న పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయని, 17 మంది ఎంపీలు తెలంగాణ వారుంటే ఢిల్లీలో తెలంగాణను బతిమిలాడి తీసుకోవడం కాదు, శాసించి తీసుకోవచ్చని చెప్పారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు.