అడిగితే ఏం చెప్తారు: బొత్సకు విష్ణువర్ధన్, కెకె ససేమీరా
విస్తృతస్థాయి పార్టీ సమావేశంలో తెలంగాణ, సమైక్యాంధ్రలపై చర్చ వద్దని చెప్పారు. తెలంగాణ అంశం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. దీనికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ... కార్యకర్తలు తెలంగాణపై ప్రశ్నిస్తే ఏం చెబుతామన్నారు. అందుకు బొత్స తాను అలా జరగకుండా చూస్తానని విష్ణుతో చెప్పారు. ప్రజాప్రతినిధులు ఎవరూ తెలంగాణపై మాట్లాడవద్దని, మిగిలిన నేతలు మాట్లాడకూండా తాను నచ్చజెపుతానని అన్నారు.
అదే సమయంలో కేంద్ర హోంశాఖపై మండిపడ్డ యాదవ రెడ్డికి బొత్స హితవు పలికారు. సొంత పార్టీ పైన విమర్శలు తగవని, అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, అధిష్టానం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని బొత్స చెప్పారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ గురించి మాట్లాడక తప్పదని బొత్సకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ భేటీకి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో పాటు రెండు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు హాజరయ్యారు. తెలంగాణపై అడిగిన నేతలను సబితా రెడ్డి కూడా సముదాయించినట్లుగా సమాచారం. అధిష్టానంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తీసుకు వద్దామని ఆమె సూచించినట్లుగా తెలుస్తోంది.
ఎల్బీ స్టేడియంలో 16న జరిగే సమావేశాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను బొత్సతో కలిపి పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడారు. 16న జరిగే సమావేశంలో తమ అభిప్రాయాలను తప్పకుండా వ్యక్తపరుస్తామన్నారు. సదస్సులో అభిప్రాయం చెప్పవద్దనడం సరికాదన్నారు. కాంగ్రెసులో స్వేచ్ఛ ఉంటుందని, కాబట్టి తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. భిన్నాభిప్రాయాలను విభేదాలు అనలేమన్నారు.
సదస్సు కాంగ్రెసు పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కాంగ్రెసుదే అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారన్నారు. తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా అధిష్టానం, కేంద్రం స్పష్టత ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని బొత్స వేరుగా అన్నారు. అఖిల పక్ష సమావేశానికి ఎవర్ని పంపాలి, ఎందర్ని పంపాలనే విషయాన్ని 16 తర్వాత ఆలోచిస్తామన్నారు.