బాబుపై పోరు: పురంధేశ్వరి బహిరంగ లేఖ వెనక...?
నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల్లో చిచ్చు పెట్టింది ఆ శకునియేనా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన విషయంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. కొత్త మనస్పర్థలకు కూడా దారి తీసింది. ఈ మనస్పర్థలు చోటు చేసుకోవడానికి ఆ శకుని పెట్టిన చిచ్చేనని అంటున్నారు.
ఎన్టీ రామారావు విగ్రహం చిచ్చుకు ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు కారణమని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా తెలుగదేశం పార్టీ ద్వారా ఆయన ఎంపి పదవిని పొందినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచే పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ వద్ద చేరి చంద్రబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనేది వార్తల సారాంశం.
గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా హరికృష్ణ తరఫున ఆయన లేఖలు రాసేవారట. హరికృష్ణకు సలహాదారుగా ఉంటూ వచ్చారని అంటున్నారు. ఇప్పుడు పురంధేశ్వరి రాసిన లేఖ వెనుక కూడా ఆయనే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. బహుశా ఆయనను దృష్టిలో ఉంచుకునే బుచ్చయ్యచౌదరి శకుని మాటలు వినవద్దని వ్యాఖ్యానించినట్లున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన పేరును మాత్రం ఎవరూ బహిరంగంగా చెప్పడం లేదు.