జగన్ పార్టీ జెండాలు: కొండా సురేఖ ఇంటి ముట్టడి
కాకతీయ యూనివర్శిటీలో రాత్రికి రాత్రే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాలు వెలియడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలను తొంగించి దగ్ధం చేశారు. అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు, అక్కడి నుంచి సురేఖ ఇంటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కూడా తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ కొండా సురేఖ ఇంటిని ముట్టడించడానికి విద్యార్థులు యత్నించారు. దీంతో ఒక్క సారిగా విద్యార్థులపై కొండా సురేఖ అనుచరులు దాడికి పాల్పడి విచక్షణ రహితంగా కర్రలతో చితకబాదారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
విద్యార్థుల అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులపై దాడి చేసిన గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జెండాలు వెలియడానికి సురేఖనే కారణమని భావించి విద్యార్థులు ఆమె ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు.