తెలంగాణ: తెరాస వైపు నలుగురు, జగన్ వైపు ఇద్దరు
అయితే కాంగ్రెసు పార్టీ ఓ నిర్ణయం తీసుకోకుంటే తాము ఆలోచిస్తామని వారు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎఫ్డిఐల నుండి గట్టెక్కేందుకు ఎంపీలను చల్లబర్చడం కోసం అఖిల పక్ష సమావేశ తేదిని ప్రకటించారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెసు తన అభిప్రాయాన్ని అఖిల పక్షంలో చెప్పదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు.
కేంద్రం కూడా అఖిల పక్ష సమావేశంలో మిగిలిన పార్టీల నిర్ణయాన్ని తీసుకొని కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేయాలనే భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. లోక్సత్తా మినహా రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలకు పిలుపు వచ్చింది. కాంగ్రెసును కూడా పిలిచినప్పటికీ రాష్ట్రం నుండి వెళ్లే నేతలు మరోసారి తమ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు టిడిపి, టిఆర్ఎస్, బిజెపి సహా విపక్షాలు అన్ని కాంగ్రెసు మొదట తమ నిర్ణయాన్ని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణకు ఓకే అంటే సీమాంధ్రలో నష్టం. సమైక్యాంధ్రకు ఓకే అంటే తెలంగాణలో నష్టం. కాబట్టి కాంగ్రెసు ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవంటున్నారు. కాంగ్రెసు నిర్ణయం తీసుకోని పక్షంలో తెలంగాణ ప్రాంతంలోని నలుగురు ఎంపీలు తెరాసలో, ఇద్దరు ఎంపీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపి వివేక్, వరంగల్ ఎంపి రాజయ్య, నాగర్ కర్నూలు ఎంపి మంద జగన్నాథంలు కెసిఆర్ వైపుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇక నల్గొండ జిల్లాలో ఇద్దరు ఎంపీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోమటిరెడ్డి సోదరులు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులుగా, వైయస్ జగన్ పార్టీలోకి వెళ్లే నేతలుగా ముద్ర పడ్డారు. జగన్ పార్టీలోకి వెళ్లమని వారు చెబుతున్నప్పటికీ ఎప్పటికైనా ఆయన చెంతకే వెళ్తారనేది పలువురి వాదన. దీంతో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగన్కు జై కొట్టే అవకాశాలున్నాయి. నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వీరి దారిలోనే నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.