తెలంగాణ మంత్రులు అలా కోరలేదు: బొత్స స్పష్టం
తెలంగాణ మంత్రుల అభిప్రాయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని, వారికి తాను ఈ విషయం చెప్పానని ఆయన అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణపై చర్చిస్తామని, సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆ తర్వాత పార్టీ అధిష్టానానికి విన్నవిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన గానీ, కలిసి ఉండాలని గానీ వస్తున్న డిమాండ్లు సున్నితమైనవని, ఈ విషయంలో మీడియా కూడా సహకరించి, సమస్య పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీలోగా మూడు ప్రాంతాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రేపటి విస్తృత స్థాయి సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి తగిన కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు.
నగదు బదిలీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంపై కూడా సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించి తమ విజయాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, 61 శాతం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని ఆయన చెప్పారు. రైతులకు మేలు జరగాలనే కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. అధికార దాహంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, విస్తృత స్థాయి సమావేశం తర్వాత వాటిని తిప్పికొడుతామని ఆయన అన్నారు. కార్యకర్తలను చైతన్యపరిచేందుకే రేపటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి సి. రామచంద్రయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.