మా దారి చూసుకుంటాం: బొత్సతో తెలంగాణ మంత్రులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెడతామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో తెలంగాణ మంత్రులు శనివారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశానికి ఒక్క ప్రతినిధినే పంపించాలని, రేపటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని వారు బొత్సను కోరారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత మూడు ప్రాంతాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై చర్చిస్తానని బొత్స వారికి హామీ ఇచ్చారు.
తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశానికి పార్టీ తరఫున ఒక్క ప్రతినిధి మాత్రమే పంపించాలని కోరుతూ సోనియాకు లేఖ రాస్తామని, తెలంగాణపై పార్టీ వైఖరి ప్రకటించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు విజ్ఞప్తి చేస్తామని జానా రెడ్డి బొత్సతో సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ సమస్య సత్వర పరిష్కారానికి ఆలోచన చేస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. వివిధ రకాల ప్రశ్నలతో తెలంగాణపై ప్రశ్నలు వేసి తమ నుంచి సమాధానాలు రాబట్టాలని మీడియా ప్రతినిధులు, ప్రజలు అనుకుంటున్నారని, సందర్భాలను బట్టి తాము సమాధానాలు ఇస్తామని, ఇదే గంటలో తేల్చాలని గందరగోళం సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. తమ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని ఆయన స్పష్టం చేశారు.
వివిధ రకాల అభిప్రాయాలతో తమను సవాల్ చేస్తూ, తమను అనుమిస్తూ, అపోహలు కలిగించడం సబబు కాదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశం విషయంలో ఆలోచన దిశగా తాము పయనిస్తున్నామని, తమకు తగిన సలహాలు ఇవ్వాలని ఆయన అన్నారు. తక్షణమే తెలంగాణ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు అధిష్టానానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం తమకు ఏమైనా చెప్తే మీకు చెప్తామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ విషయంలో తమ మంత్రులందరికీ బాధ్యత ఉందని, అందరికన్నా ఎక్కువ బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ప్రజలకు తమ పట్ల అభిమానం ఉంది, అనుమానం ఉందని, తన అనుభవంతో పార్టీ పరిధిలో తెలంగాణ కోసం కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. అఖిలపక్ష సమావేశానికి ఎందరు వెళ్లినా తెలంగాణపై కాంగ్రెసు ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణపై రేపటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశం తర్వాత తెలంగాణకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ ఒక కీలక దశకు చేరుకుందని ఆయన అన్నారు. గత సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పి ప్రస్తుత అఖిలపక్ష సమావేశాన్ని గందరగోళం చేయవద్దని ఆయన అన్నారు. ప్రజల మధ్య సామరస్యం దెబ్బ తినకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.