అమెరికా బడి కాల్పులు: కంటతడి పెట్టిన ఒబామా
పాఠశాలలో 5 నుంచి 10 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు మరణించిన సంఘటనను ప్రస్తావించినప్పుడు ఆయన విపరీతంగా కదిలిపోయినట్లు కనిపించారు. ప్రసంగాన్ని ఏకధాటిగా కొనసాగించలేకపోయారు. మధ్య మధ్య ఆగుతూ ప్రసంగం చేశారు. తమ గుండెలు పగిలాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా పతాకలను అవనతం చేయాలని ఆయన ఆదేశించారు.
అమెరికాలోని కనెక్టికట్ ఎలిమెంటరీ పాఠశాలలో విచక్షణారహితంగా జరిగిన కాల్పుల్లో 26 మంది మరణించారు. వారిలో దాదాపు 20 మంది పిల్లలేనని తెలుస్తోంది. పాఠశాల బయట ఇద్దరు మరణించి కనిపించారు. కాల్పుల్లో పాఠశాల ప్రిన్సిపల్ కూడా చనిపోయినట్లు సమాచారం. న్యూయార్క్ నగరానికి 90 కిలోమీటర్ల దూరాన ఉన్న కనెక్టికట్లో ఈ దారుణం జరిగింది. కనెక్టికట్ న్యూటౌన్లోని శాండీ హుక్ ఎలిమెంటరీ పాఠశాలలోకి శుక్రవారం ఉదయం సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో ఓ దుండగుడు బడి ఆవరణలో అడుగుపెట్టాడు. తూపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా చెలరేగిపోయాడు.
కనెక్టికట్ పాఠశాలలో కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించారు. అతను 24 ఏళ్ల రీయాన్ లాంజాగా గుర్తించారు. రెండో వ్యక్తి గుర్తింపు కోసం అతని తమ్ముడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన యువకుడి తల్లి నాన్సీ లాంజా పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. కాల్పుల్లో ఆమె కూడా మరణించినట్లు అనుమానిస్తున్నారు.
న్యూజెర్సీలోని నిందితుడి గర్ల్ ఫ్రెండ్, మరో మిత్రుడు అదృశ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. యువకుడు తల్లి కారులోనే కారులో పాఠశాలకు చేరుకున్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో మూడు గన్లు కనిపించినట్లు చెబుతున్నారు.