ఎవరికీ భయపడేదిలేదు, ఎవరేంటో చూస్కుందాం: కిరణ్
తమ కుటుంబం ఇప్పటికి పన్నెండు ఎన్నికల్లో పోటీ చేసిందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇస్తే 13వ ఎన్నిక అవుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ చేసేది ఎక్కువ చెప్పేది తక్కువ అని, అదే విపక్షాలు చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అని విమర్శించారు. తమకు కార్యకర్తలే మీడియా అన్నారు. మిగిలిన పార్టీలో మీడియా కాంగ్రెసు పార్టీకి అవసరం లేదన్నారు. ప్రజల ముందు వాస్తవాలు చెప్పడమే కాంగ్రెసు ఉద్దేశ్యం అన్నారు.
కరెంట్ కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఐదారు సంక్షేమ పథకాలు అందున్నాయన్నారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెసు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకు వస్తామన్నారు. పోలవరంతో ఏ ప్రాంతానికి నష్టం జరగదన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డైనా తినేందుకు సిద్ధంగా ఉంటాడన్నారు.
దేశమంతా పాదయాత్ర చేసినా ఆయన అధికారంలోకి రాలేడన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దురదృష్టమేమో కానీ కరవు, వరదలు పీడించాయన్నారు. కార్యకర్తలే కాంగ్రెసు బలం అన్నారు. తమది రైతు ప్రభుత్వమన్నారు. సంక్షేమ పథకాల కోసం 26వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు.
చిన్న చిన్న పార్టీలు కూడా తమ వల్ల ప్రభుత్వం నిలబడిందని బెదిరించడం హాస్యాస్పదమన్నారు. మనం ఎవరికీ భయపడేది లేదన్నారు. మజ్లిస్ పార్టీయే కాంగ్రెసు వల్ల రెండు స్థానాల నుండి ఏడు స్థానాలకు పెరిగిందన్నారు. తాను ఎవరికి భయపడేది లేదని, మీరు కూడా ఎవరికీ భయపడవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి ఎవరేంటో చూసుకుందామని సవాల్ చేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే ఎవరి సత్తా ఎంతో తేల్చుతారన్నారు. కాంగ్రెసు పార్టీని, అధినేత్రి సోనియా గాంధీని ఎవరైనా అంటే ఊరుకునేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ ఎవరిదో చూసుకుందామని మజ్లిస్ను ఉద్దేశించి అన్నారు. మజ్లిస్ వల్ల కాంగ్రెసు అధికారంలోకి రాలేదన్నారు. కాంగ్రెసు హయాంలోనే మైనార్టీలకు రక్షణ అన్నారు. వచ్చే జూన్ లోగా హైదరాబాద్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓ విధానం లేదన్నారు. సబ్ ప్లాన్ అంశంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిందన్నారు. మండలిలో ఓటు వేయకుండా బిల్లును అడ్డుకుందన్నారు. అవిశ్వాసం పేరుతో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు వైయస్సార్ కాంగ్రెసు చేస్తోందన్నారు. 1983 నుండి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాలేదన్నారు. కానీ 2014లో కాంగ్రెసు మూడోసారి గెలుస్తుందన్నారు.
కాంగ్రెసును ఎవరూ ఓడించలేరన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీ కాంగ్రెసును ఓడించలేదన్నారు. మనల్ని మనమే ఓడించుకుంటామన్నారు. కలిసికట్టుగా వచ్చే సొసైటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పని చేద్దామన్నారు. సంక్రాంతిలోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అందరూ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం చాలా రోజుల తర్వాత వచ్చిందన్నారు. కొన్ని టపాకాయలు కూడా పేలాయని, అవి సాధారణమే అన్నారు.
ఏ సామాజిక వర్గానికి కాంగ్రెసు వ్యతిరేకం కాదన్నారు. ఈ సదస్సులో పలువురు నేతలు చంద్రబాబు బిసిలకు వంద సీట్లు ఇస్తామంటే మాట్లాడటం లేదని ప్రశ్నించారని.. కానీ ఆయన ఎప్పుడైనా మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. అయినా బిసిల అభివృద్ధికి కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. బిసిల అంశాన్ని వి హనుమంత రావు తదితరులు లేవనెత్తారు.
ఎవరున్నా మేనిఫెస్టో అమలు
కాంగ్రెసు పార్టీ మహా వ్యవస్థ అని, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీ మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదన్నారు. దానిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని తాము కోరుతామని చెప్పారు. కాంగ్రెసు ద్వారానే నగదు బదలీ పథకం సమర్థవంతంగా అమలవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వలే మైనార్టీలకు కూడా ఓ ఉప ప్రణాళిక అవసరం ఉందన్నారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు.