షర్మిల కాలికి గాయం: కలిసిన జగన్ సతీమణి భారతి
కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందని, కనీసం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విశ్రాంతి తీసుకోవడానికి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నమే పాదయాత్ర సాగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో షర్మిల తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు వారించడంతో ఆమె వెనక్కి తగ్గారు.
కాగా ఆమె పాదయాత్ర రద్దు అయిందని శనివారం సమన్వయ కమిటీ సభ్యులు తలశిల రఘురాం, కెకె మహేందర్ రెడ్డిలు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్లో ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో కాలు బెణికింది. షర్మిల పాదయాత్ర శుక్రవారం నాడు 57వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంజాపూర్ చేరుకుని అక్కడ బస చేశారు. షర్మిల శుక్రవారం 16.30 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
ఇప్పటి వరకు ఆమె పాదయాత్ర 824 కిలోమీటర్లు పూర్తయింది. శుక్రవారంనాడు ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీ నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో సాగింది. శని, ఆది వారాల విశ్రాంతి తర్వాత సోమవారం ఆమె పాదయాత్ర యథావిధిగా ప్రారంభమవుతుంది.