మనసులు గాయపడినా..!: సదస్సులో పదవిసలు
హైదరాబాద్: రాజధాని నగరంలోని ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెసు పార్టీ రాష్ట్ర మేధోమధనం సదస్సు వాడిగా వేడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి హీటెక్కించి సాయంత్రానికి చల్లగా ముగిసింది. ఈ సదస్సులో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సదస్సులో తెలంగాణ కోసమంటూ తెలంగాణవాదులు పట్టుబట్టారు. తమ అభిమాన నేత ఫోటో లేదంటూ చిరంజీవి అభిమానులు అలిగారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫోటో లేదని ఆ వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ఎనిమిదిన్నరేళ్లుగా అమలవుతున్న పథకాలు అన్నీ కాంగ్రెసు పథకాలుగా నేతలు ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రయత్నించారు. ఏ పథకం కూడా ఎవరి వ్యక్తిగతం కాదని తెల్చే చెప్పే ప్రయత్నం చేశారు. అదే విధంగా ముస్లింలకు రిజర్వేషన్ల అంశం కూడా ఏ నేతకు సంబంధించినది కాదని చెబుతూనే.. ఆ ప్లాన్ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ది అని ప్రకటించారు. ఆజాద్ కారణంగానే ముస్లింలకు రిజర్వేషన్ అమలు అని చెప్పారు.
తద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు చేశారు. తెలంగాణపై వాగ్వాదం ఇరు ప్రాంత నేతల మధ్య విభేదాలను స్పష్టంగా తెలియజేశాయి. కేంద్రమంత్రి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన వర్గాన్నే కాకుండా కాంగ్రెసు నేతలను ఆలోచనలో పడేశాయి. ఎంపిలు అంజన్ కుమార్ యాదవ్, వి హనుమంత రావులు చేసిన కామెంట్లు బిసిలకు, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెసు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పాయి.
వాడిగా వేడిగా సదస్సు సాగినప్పటికీ ప్రజల్లోకి పథకాలను ఎలా తీసుకు వెళ్లాలి? పార్టీలోని లోపాలను ఎలా సవరించాలి? తదితర వాటిపై అధిష్టానం దృష్టి సారించేందుకు అవకాశం కలిగింది. మరో విషయమేమంటే పలువురు నేతల మనసులు ఈ కార్యక్రమంలో నొచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ అంతిమంగా వారంతా బాధను దిగమింగుకొని వైఫల్యాలను బయటపెట్టి మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని పార్టీ పెద్దలకు తెలియజేశారని చెప్పవచ్చు.
కాంగ్రెసు పార్టీ మేధోమధనం సదస్సు వాడిగా వేడిగా ప్రారంభమై మధ్యాహ్నం మరింత హీటెక్కి సాయంత్రానికి కూల్గా మారింది.
కాంగ్రెసు పార్టీ కురువృద్ధుడు జి.వెంకట స్వామి(కాకా) మధ్యలోనే సదస్సు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కనిపించకపోవడంతో వివిధ రకాల కామెంట్స్ వస్తున్నాయని అందుకే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేందుకే వచ్చానని చెప్పి నవ్వులు పూయించారు.
ప్రారంభంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత, తెలంగాణ ఎంపీలకు అవమానం జరిగింది. వేదిక పైకి ఎక్కేందుకు ఎంపీలకు అనుమతి లభింలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. కవితను కూడా విఐపి గ్యాలరీలోకి అనుమతించలేదు. దీంతో ఆమె బయట ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత సద్దుమణిగింది.
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రసంగిస్తూ.. సోనియా, మన్మోహన్ను ప్రశంసిస్తుండగా ఒకరు లేచి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గురించి కూడా మాట్లాడాలన్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాద రావు వేదికపై మంత్రులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో తోటి మంత్రులతో కలిసి కూర్చున్నారు.
చిరంజీవి పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావును అనుకరించి నవ్వులు పూయించారు. అదే సమయంలో వచ్చినందుకు అనుకున్న ప్రతిఫలం తనకు దక్కకున్నా దక్కిందే చాలని అనుకున్నానని అన్నారు.
ఫ్లెక్సీలో చిరంజీవి ఫోటో లేకపోవడంతో అభిమానులు అలక వహించి అక్కడి నుండి వెళ్లిపోయారు.
కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ - బొత్స సత్యనారాయణల మధ్య వాగ్వాదం హీటెక్కించింది.
బిసిలకు న్యాయం జరగడం లేదంటూ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ గొంతెత్తారు. ఆయన తర్వాత మాట్లాడిన పలువురు ఆయనకు మద్దతు పలికారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ గులాం నబీ ఆజాద్ క్రెడిట్గా చెప్పారు. అది వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగతం కాదని తేల్చి చెప్పారు! అలాగే ఉచిత విద్యుత్కు కూడా సోనియా ఆశీస్సులు ఉన్నాయన్నారు.
సదస్సు చివర్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతా కూల్ అయ్యాక అప్పుడప్పుడు సమావేశంలో టపాసులు పేలాయని ఇవి సాధారణమే అని హీటెక్కించిన అంశాలపై స్పందిస్తూ అన్నారు.