మన ఆస్తులు పంచుకుందామనే: కెసిఆర్పై కావూరి
ఈ సందర్భంగా కావూరి మాట్లాడారు. అమాయకమైన విద్యార్థులను, ప్రజలను కెసిఆర్ రెచ్చగొట్టి ఆస్తులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రుల ఆస్తులను పంచుకుందామనే ఉద్యమంలో అమాయకులను కొందరు రాజకీయ నేతలు ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులను, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు.
నేతలు వ్యాపార దృక్పథంతో ఉద్యమాలను రెచ్చగొడుతన్నారని, రాజకీయ నిరుద్యోగులే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారన్నారు. అలాంటి వారు కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కెసిఆరే కారణమన్నారు. ఒక్కో పార్టీ నుండి ఇద్దరిని అఖిల పక్ష సమావేశానికి పిలవడం సమంజసమే అని ఎమ్మెల్యే విష్ణు అన్నారు. విభజన అవసరమైతే పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉండాలన్నారు.
సమావేశం అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ... తాను నలబై ఏళ్లుగా కాంగ్రెసు పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. తన భవిష్యత్తు గురించి తనకు ఎలాంటి భయం లేదన్నారు. తాను ఎక్కడున్నా రాణిస్తానని చెప్పారు. ఇన్నాళ్లూ కాంగ్రెసు అధిష్టానానికి విజ్ఞత ఉందని భావించానని, కానీ నిజాయితీ, చిత్తశుద్ధితే పని చేస్తే అలాంటి వారిని గుర్తించకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తోందని అన్నారు. తన అసంతృప్తికి, ఉద్యమానికి సంబంధం లేదన్నారు.
ఒకటో తేది నుండి తన రాజీనామా అమలులోకి వస్తుందన్నారు. తాను రాజకీయాలు వదిలేసేంత పిరికి వాడిని కాదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను పిలుస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని తాను నిర్ణయించుకోలేదని చెప్పారు.