షర్మిల పాదయాత్ర తర్వాత కొనసాగుతుందా?
చంచల్గుడా జైలులో వైయస్ జగన్ను కలిసిన తర్వాత ఆమె ఆస్పత్రికి వెళ్లి మెకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆరు వారాలు విశ్రాంతి అంటే, కనీసం నెలన్నర రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు వారాల తర్వాతనైనా ఆమె పాదయాత్ర కొనసాగుతుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఆమె పాదయాత్ర ఆగిపోయింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర కర్నూలు, అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది.
ఆమె విశ్రాంతి తీసుకునే సమయంలోనే క్రిస్ట్మస్ పర్వదినం వస్తుంది. అలాగే, జనవరిలో సంక్రాంతి పర్వదినం వస్తుంది. ఒకవేళ ఆమె తిరిగి పాదయాత్ర కొనసాగించాలనుకుంటే సంక్రాంతి తర్వాతనే అవుతుందని అంటున్నారు. ఈలోగా పరిణామాలు ఏ దిశగా చోటు చేసుకుంటాయో తెలియదు.
నిజానికి, తనకు బెయిల్ వస్తుందని, బెయిల్ వచ్చిన తర్వాత తాను పాదయాత్ర చేస్తానని వైయస్ జగన్ తమ నేతలతో అప్పట్లో చెప్పారని అంటారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టారని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు పాదయాత్ర చేస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెసు నుంచి పాదయాత్ర చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో తీవ్రమైన తర్జనభర్జనల తర్వాత షర్మిల పాదయాత్రకు నిర్ణయం జరిగింది.
షర్మిల పాదయాత్రపై నిజానికి, తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. పాదయాత్రతో పార్టీకి ఓ ఊపు రావడమే కాకుండా పలువురు నాయకులు పార్టీలో చేరుతారని అనుకున్నారు. అలా ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు అర్థాంతరంగా షర్మిల పాదయాత్ర ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.