జగన్ జైలుకెళ్తే అయ్యోపాపం అనుకున్నా:కిరణ్, ఉద్రిక్తత
ప్రభుత్వం వేరు.. సానుభూతి వేరు అన్నారు. కన్నీరు పెట్టుకున్నారని కరిగితే రాష్ట్రానికి నష్టమన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మన ప్రియతమ నేత అన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీకి చెందిన నేత అన్నారు. జగన్ జైలుకు ఎందుకు వెళ్లారో గుర్తుంచుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లలేదన్నారు. జగన్ పైన కేసుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇంత తక్కువ సమయంలో కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టుకున్నారన్న కోర్టు వ్యాఖ్యలపై ఆ పార్టీ స్పందించకుండా అనవసర ఆరోపణలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ బిల్లును ఓడించేందుకు జగన్ తెలుగుదేశం పార్టీతో సభలో చేయి కలిపారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాట కార్యక్రమం రెండో రోజు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోంది. ఆయన అంతకుముందు గాజువాకలో మాట్లాడారు.
విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. పేదరికంతో చిన్నారులు ఎవరూ చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. 2008 నుండి తమ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ఉపకార వేతనాలను అందించిందన్నారు. 9.20 లక్షల మందికి మెస్ ఛార్జీలు పెంచామని చెప్పారు.
అనకాపల్లిలో ఉద్రిక్తత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనకాపల్లిలో మాట్లాడుతుండగా మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు జర్నలిస్టులను సభ వద్ద నుండి బయటకు ఈడ్చుకు పోయారు. దీంతో జర్నలిస్టులు సభను బహిష్కరించారు.