కొత్త పార్టీ యోచనలో కావూరి: అందుకే బైరెడ్డి హడావుడి
పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న కావూరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళతారనే ప్రచారం జరిగింది. ఆయన కూడా వాటిని ఖండించకుండా పార్టీ తనను విస్మరించినప్పుడు ఇంకో పార్టీ వైపు చూస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కొత్తగా మరో వాదన తెరపైకి వస్తోంది. కాంగ్రెసులో ఉండకుండా, జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోకుండా కావూరి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
ఆయనే ఇండికేషన్స్ ఇచ్చారంటున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రం విడిపోయే సూచనలు కనిపిస్తే అవసరమైన పక్షంలో సమైక్యాంధ్ర పార్టీ ఉద్భవిస్తుందని చెప్పారు. కావూరి ప్రస్తుతం కొత్త పార్టీ ప్రయత్నాలను సైలెంట్గా చేసుకు పోతున్నారేమోననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పెట్టడం కంటే ఇంకో పార్టీలో చేరడమే ఉత్తమమని ఆయన సహచరులు కావూరికి సూచిస్తున్నారట.
మరోవైపు తెలంగాణ బూచి చూపి టిడిపికి రాం రాం చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమకు ప్రాధాన్యత ఏదని ఇటీవల హడావుడి చేస్తున్నారు. టిడిపి బలోపేతం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించిన సమయంలోనే ఆయన సీమ కోసమంటూ పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. అఖిల పక్ష సమావేశం తెర పైకి వచ్చాక ఆయన మళ్లీ తన హడావుడి పెంచారు.
అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు రాయలసీమ గురించి చర్చించాలని ఆయా పార్టీ నేతలను కలిసి కోరారు. బిజెపి, కాంగ్రెసు, తెలుగుదేశం తదితర అన్ని పార్టీలను ఆయన కోరారు. బైరెడ్డి కూడా రాయలసీమ కోసమంటూ కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలు చేశారట. కావూరి, బైరెడ్డిలు పార్టీలు పెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతున్నా మరికొందరు మాత్రం కొట్టి పారేస్తున్నారు.