గుజరాత్: టిడిపి, కాంగ్రెస్ ఉత్సాహం! వీరశివా సూచన
దాడి ధీమా
గుజరాత్ ఎన్నికల ఫలితాలు మనకు కూడా స్ఫూర్తిని ఇస్తాయని టిడిపి నేత దాడి వీరభద్ర రావు అన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెసు పార్టీని ఓ ప్రాంతీయ పార్టీగా మార్చేశాయన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పదేళ్ల పాటు బాగా పాలించారని, దానిని చూసి అక్కడి ప్రజలు బిజెపిని మరోసారి గెలిపించారన్నారు. ఎపి ప్రజలు కూడా సుపరిపాలన కోరుకుంటున్నారన్నారు. మన రాష్ట్రంలో సుపరిపాలన టిడిపి వల్లనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కాపాడగలరని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. గుజరాత్ ప్రజలు సుపరిపాలనకు ఓటేశారని, రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు అలాంటి పాలనకు ఓటేస్తారని, ఆ పాలన టిడిపికే సాధ్యమన్నారు.
బొత్స మాట
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పథకాలు, అభివృద్ధిని ప్రజలు ఆదరిస్తున్నారని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు నిరూపించాయని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. హిమాచల్ను తాము హస్తగతం చేసుకున్నామని, గుజరాత్లో గతంలో కంటే సీట్లు పెరిగాయన్నారు. కాంగ్రెసును ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. ఈ ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంపై పడుతుందన్నారు.
వీరశివా సలహా
గుజరాత్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనను చూసి రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మూడోసారి ఎలా అధికారంలోకి రావాలో నేర్చుకోవాలని కమలాపుర్ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఉండి పార్టీకి నష్టం కలిగించే వారిని ధైర్యంగా దూరం పెట్టాలన్నారు. అధిష్టానం కూడా ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్లకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు.