జగన్ను కల్సిన ఫ్యామిలీ: జైలు వద్ద సందడి, వేడుకలు
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం కలిశారు. ఈ రోజు జగన్ పుట్టిన రోజు. తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి రెడ్డి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జైలులో జగన్ను కలిశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో చంచల్గూడ జైలుకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి పెరిగింది. చాలామంది అక్కడకు తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వస్తాడని తమకు నమ్మకముందని, దేవుడు తమకు అన్యాయం చేయడనే నమ్మకముందన్నారు.

ఆయన ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా ఉండాలంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిలా జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. జైలు వద్ద భారీ కటౌట్లు కూడా వెలిశాయి. జగన్ మంచి నాయకుడు అని, జైలులో పుట్టిన రోజు జరుపుకోవడం దురదృష్టకరమని, దమ్మున్న నేత జగన్ అని, తమ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కుట్ర పూరితంగా జగన్ను జైలుకు పంపించారని, తమ అధినేత తప్పు చేయలేదని ప్రజలందరికీ తెలుసునని, ఆయన జనం గుండెల్లో ఉన్నారని వచ్చిన అభిమానులు చెబుతున్నారు.
జైలు దగ్గర కేక్ కట్ చేసిన అభిమానులు, కార్యకర్తలు అక్కడ నుండి వెళ్లే వారికి స్వీట్ పంచారు. పావురాలను ఎగురవేశారు. జగన్ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications