ఢిల్లీ గ్యాంగ్ రేప్: కంటతడి పెట్టిన షీలా దీక్షిత్
గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో సామూహిక అత్యాచారంపై షీలా దీక్షిత్ మాట్లాడారు. బాధితురాలు మధ్యతరగతి కుటుంబానికి చెందిందని, ఆ బాలికకు జరిగిన నష్టాన్ని ఏ విధంగానూ పూడ్చలేమని, ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడడానికి తాను ఏ సహాయానికైనా సిద్ధంగా ఉన్నానని షీలా దీక్షిత్ అన్నారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు మౌనంగా ఆగ్రహాన్ని అణచుకుంటున్నారని, వారి బాధను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దడానికి తాను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. ఎన్నికలను తాను పట్టించుకోదలుచుకోలేదని, ఎన్నికలు వస్తాయీ పోతాయి కానీ మానవత్వం నిలిచి ఉంటుందని ఆమె అన్నారు.
రాజకీయవేత్తగా మారిన సామాజిక కార్యకర్త అర్వింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అత్యాచారాలను అరికట్టడానికి కొత్త చట్టాలు అవసరమని, ఈ కేసుల్లో దోషులకు రెండు నెలల్లో శిక్ష పడేలా కోర్టులు, వ్యవస్థలు పనిచేయాలని ఆయన అన్నారు.
రాష్ట్రపతి భవన్ వద్ద ప్రదర్శన చేస్తున్న ఆందోళనకారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలుసుకుని మాట్లాడాలని అన్నా టీం సభ్యురాలు కిరణ్ బేడీ కోరారు. కాగా, రేప్ చట్టాలపై చర్చించడానికి హోం శాఖ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీ పోలీసు కమీషనర్ నీరజ్ కుమార్ను పిలిచింది.