వారిని శిక్షించండి: తల్లితో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు
అమ్మా నీవు తిన్నావా అని నోట్లో రాసింది. తనతో పాటు నిందితుల దాడిలో గాయపడ్డ స్నేహితుడి గురించి కూడా అడిగింది. తన ఎటిఎం, సిమ్ కార్డ్స్ బ్లాక్ అయ్యాయా అని ప్రశ్నించింది. నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వారు.. ఆ తర్వాత ఎటిఎం కార్డును, మొబైల్ను ఎత్తుకెళ్లారు. బాధితురాలు వైద్య విద్యార్థి. ఆమె ఫైనల్ ఇయర్ చదువుతోంది. తన కూతురును కాపాడాలని బాధితారాలి తల్లి డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
కాగా తనకు బతకాలని ఉందని ఢిల్లీ సామూహిక అత్యాచారం బాధితురాలు తన తల్లితో రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కృష్ణ తీర్థ్ సఫ్తర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. అమ్మాయికి మరో ఆపరేషన్ చేయనున్నారని చెప్పారు. అమ్మాయికి వైద్యులు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారని చెప్పారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.
బాధితురాలు ప్రస్తుతం డాక్టర్లు, తన బంధువులతో మాట్లాడుతోందన్నారు. సోనియా గాంధీ కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు ఉదయం బాధితురాలు తన తల్లితో మాట్లాడుతూ... అమ్మా.. నాకు బతకాలని ఉందని చెప్పింది. ఈ మాట విన్న తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె పరిస్థితి తల్లితో పాటు అక్కడున్న డాక్టర్లు, ఇతరులను కలిచి వేసింది. ఆమె అతి కష్టమ్మీద ఆ మాటలు మాట్లాడింది. ప్రస్తుతం ఆమె వెంటిలెటర్ పైన ఉంది.