పోలీసు లాఠీఛార్జ్: సొమ్మసిల్లిన టిడిపి నేత, 144 సెక్షన్
మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఆయన తనయుడు కలిసి సహకార సంఘ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్తలు మంత్రి ఇంటి వైపుకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు వారిని ఆపేందుకు లాఠీఛార్జ్ చేసి అక్కడ నుండి చెదరగొట్టారు.
తమపై లాఠీఛార్జీని నిరసిస్తూ కోడెల, దూళిపాళ్లలు కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు మరోసారి లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో కోడెల శివప్రసాద రావుపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో అతను అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు.
కార్యకర్తలు ఆయనకు సపర్యలు చేశారు. పోలీసుల దాడిని నిరసిస్తూ కార్యకర్తలు అక్కడే ఆందోళనకు దిగారు. కోడెల సొమ్మసిల్లి పడిపోయారని తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పోలీసులు నరసారావుపేటలో 144వ సెక్షన్ విధించారు. నరసారావు పేటకు ఎవరూ రావొద్దని చుట్టుపక్కల గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కోడెల, దూళిపాళ్లను అరెస్టు చేశారు.