కాంగ్రెసు టార్గెట్.. 3లైన్లతో టిడిపి: డైలమాలో కాంగ్రెస్

లేఖ డ్రాఫ్ట్ అంశాన్ని యనమల రామకృష్ణుడుకు పార్టీ అప్పగించింది. టిడిపి వైఖరి చెప్పడమే కాకుండా కాంగ్రెసు పార్టీని ఇరుకున పడేసే విధంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారట. టిడిపి మూడు లైన్లతో కూడిన లేఖ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లెటర్ హెడ్ పైన అభిప్రాయాన్ని చెప్పనున్నారు.
2008లో తాము నాటి మంత్రి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణపై లేఖ ఇచ్చామని, ఆ లేఖ కేంద్రం వద్దే ఉందని, ఆనాడు తాము అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని తాజా లేఖలో రాసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేయనున్నారు.
సోనియాతో ఆజాద్ భేటీ
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆయన అఖిల పక్ష సమావేశం పైన, పార్టీ నుండి పంపించాల్సిన నేతల పైన ఆమెతో చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమయింది. చిదంబరం, అహ్మద్ పటేల్, ఆంటోనీ, ఆజాద్, జనార్దన్ ద్వివేది భేటీ అయ్యారు. అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలి, ఎవరిని పంపించాలనే అంశంపై చర్చించారు.
అంతకుముందు ఆజాద్ ఆరుగురు సభ్యులతో కూడిన బృందంతో భేటీ అయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్, గాదె వెంకట రెడ్డి, చెంగల్రాయుడు, మల్లు రవి, చిన్నా రెడ్డి, సురేష్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. తమలో ఎవరిని పంపించినా అభ్యంతరం లేదని వారు ఆజాద్కు చెప్పారు. ఎవరిని పంపించాలనే అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. అఖరుగా గురువారం అర్ధరాత్రి గాదె వెంకట రెడ్డి(సీమాంద్ర), కెఆర్ సురేష్ రెడ్డి(తెలంగాణ)లను ప్రతినిధులుగా ఎంపిక చేశారు. ఇరు ప్రాంతాల నుండి ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు వెళుతుండటంతో సురేష్ రెడ్డి పేరుపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఆయన పేరుపై ఎలాంటి మార్పు లేదు. చివరి నిమిషంలో మార్చే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications