అత్యంత విషమంగా గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆరోగ్యం

ఆమె అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నారని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించామని రాత్రి ఏడు గంటలకు ఆస్పత్రి బులెటిన్ విడుదల చేసింది. వివిధ రంగాల్లో నిపుణులైన స్పెషలిస్టులు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని, ఆమెను సాధారణ స్థితికి తీసుకు రావడానికి శాయశక్తులా శ్రమిస్తున్నారని మౌంట్ ఎలిజబెత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెల్విన్ లోహ్ తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని భారత హై కమిషన్ స్వయంగా పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి అధికార ప్రతినిధి తెలిపారు.
గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి బాధితురాలు అత్యంత విషమ పరిస్థితులో ఉన్నారని ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆమెకు చికిత్స అందుతోందని, వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉంచేందుకు వారు చేయగలిగిందందా చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ గ్యాంగ్రేప్ బాధితురాలికి సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స అందజేసిన సంగతి తెలిసిందే.
రోజురోజుకు పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్కు తరలించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బాధితురాలికి అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా సహకరిస్తున్నామని హై కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె వైద్యానికి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీలో హోం మంత్రి షిండే ఓ ప్రకటనలో తెలిపారు. చికిత్సకు ఎన్ని వారాలు పట్టినా అన్ని రోజులూ ఆమె కుటుంబం అక్కడే ఉండడానికి అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.
ప్రధాని గ్యాంగ్ రేప్ దోషుల సంగతిని చట్టం చూసుకుంటుందని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) 57వ సమావేశాన్ని ఉద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. మహిళల భద్రతే తమ ప్రధాన బాధ్యతని, దేశ రాజధానిలో వారికి సంబంధించిన అంశాలపై కమిషన్ ఆఫ్ ఇంక్వైరీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత చట్టాలను పునఃసమీక్షించి, తీవ్రమైన లైంగిక నేరాలకు ఎటువంటి శిక్షలు విధించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
మిస్టరీగా కానిస్టేబుల్ మరణం
ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ సుభాష్ తోమార్ మృతి తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆయన మరణం మిస్టరీగా మారింది. ఆందోళనకారుల దాడుల్లోనే ఆయన మరణించారని పోలీసులు చెబుతుంటే.. ఆయన గుండెపోటుతోనే చనిపోయారని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు.
వెబ్ సైట్లో రేపిస్టుల పేర్లు
రేపిస్టుల పేర్లు, ఫొటోలు దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలోనూ బహిరంగ ప్రదేశాలోనూ, వెబ్ సైట్లలోనూ ప్రదర్శించనున్నట్లు హోంశాశ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ అన్నారు. అత్యాచార దోషుల డాటాబేస్ను తయారు చేయాలని, వారి ఫొటోలు, వివరాలు, అడ్రస్ సేకరించి బయటపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని చేపట్టాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరోని ఆదేశించినట్లు హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications