తెలుగు సభలకు తెలంగాణ సెగ: కళాకారుల నిరసన
అధికారుల తీరుపై జానపద కళాకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక వద్ద తెలంగాణ జానపద కళాకారులు నిరసన వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తమకు రావాలనే ఉద్దేశం లేకున్నా ప్రభుత్వ అధికారులు పిలిపించారని, పిలిచి తమను అవమానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రచయితలు, కళాకారులు చాలా మంది ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని తెలంగాణ సంఘాలు పిలుపునిచ్చాయి. మహాసభల బహిష్కరణకు విప్లవ రచయితల సంఘం (విరసం) కూడా పిలుపునిచ్చింది.
తిరుపతిలో మూడు రోజుల పాటు ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తోంది. ఈ నెల 27వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలుగు మహాసభలను ప్రారంభించారు. శనివారం ఈ మహాసభలు ముగుస్తాయి. ముగింపు దశలో ప్రపంచ తెలుగు మహాసభల్లో గందరగోళం ఏర్పడడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిర్వాహకులపై కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
నిర్వాహకుల పట్ల తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాసభలకు రావాలని అనుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వాహకుల తీరుతో వెనక్కి తగ్గారు. శుక్రవారంనాడు సన్మానం అందుకు సినీ ప్రముఖులను వేదిక మీద కూర్చోబెట్టి, రచయితలను కిందికి పంపించేయడం కూడా విమర్శలకు దారి తీసింది.