జగన్ ఆస్తుల కేసు: 4న కోర్టుకు ధర్మాన, మోపిదేవి!
చౌతాలా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ధర్మానపై అవినీతి ఆరోపణలను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవచ్చునని వాదించారు. ఈ కేసులో డిఫెన్స్ వాదన వినాల్సిన అవసరం లేదని, కోర్టు తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. దీన్ని డిఫెన్స్ న్యాయవాది ఉమామహేశ్వరరావు వ్యతిరేకించారు. మంత్రులు, ఐఏఎస్లపై పిసి యాక్ట్కింద నమోదైన అభియోగాలను కోర్టులు విశ్వాసం(కాగ్నిజెన్స్)లోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమని ఇటీవలి వరకు సిబిఐ చెప్పిందని, అనుమతి కోసం ప్రయత్నించిందని, ఇప్పుడు పూర్తి భిన్నమైన వాదనను తెరపైకి తీసుకొచ్చిందన్నారు.
గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును చూపుతూ ప్రభుత్వ అనుమతి అక్కర్లేదనడం సరికాదని వాదించారు. రైట్ ఆఫ్ ఆడియన్స్ కింద తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మెమో దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి దుర్గా ప్రసాద రావు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా.. అవినీతి ఆరోపణలను విశ్వాసంలోకి తీసుకునే విషయంలో (డిఫెన్స్) వాదనలు వినేందుకు ఏ నిబంధనలున్నాయో చెప్పాలని డిఫెన్స్ న్యాయవాదిని ఆదేశించారు.
అంతకుముందు సిబిఐ న్యాయవాది బళ్లా రవీంద్రనాథ్ తన వాదనల సందర్భంగా.. అభయ్ సింగ్ చౌతాలా కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా మంత్రి ధర్మానపై పిసి యాక్ట్ కింద నమోదు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నేరం జరిగినపుడు నిర్వర్తించిన బాధ్యతల్లో నిందితులు ప్రస్తుతం లేరని గుర్తు చేశారు. రెండు అసెంబ్లీలలో ఉన్న హోదాలు వేరు కాబట్టి, ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణకు కేంద్రం అనుమతి తీసుకోవాలన్న నిబంధన వారికి వర్తించదని కోర్టుకు విన్నవించారు.
మోపిదేవి ప్రస్తుతం మంత్రిగా లేనందున ఆయన ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ అనుమతి అడగలేదన్నారు. దీంతో డిఫెన్స్ వాదనకు తగిన ఆధారాలను, నిబంధనలను చూపాలని ఆదేశిస్తూ కేసు విచారణను సిబిఐ కోర్టు జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు నిందితులు మంత్రి ధర్మానను, మాజీ మంత్రి మోపిదేవిని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.