స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అంతార్జాతీయ తెలుగు కేంద్రం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం రానుందని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్ వెల్లడించారు. సోమవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2011 సంవత్సరపు కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. 2013 సంవత్సరాన్ని తెలుగు సాహితీ, సంస్కృతి సంవత్సరంగా ప్రభుత్వం పాటించనుందని చెప్పారు.
తెలుగు భాష అమలుకు త్వరలో మంత్రిత్వ శాఖ వస్తుందని, దాని పరిధిలోకే తెలుగు విశ్వవిద్యాలయం రానుందని చెప్పారు. కీర్తి అజరామరంగా ఉంటుందనే ధర్మనిధి పురస్కారాల పేరును కీర్తి పురస్కారంగా మార్చారని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ సి.నారాయణరెడ్డి అన్నారు. నిరంతరం పురస్కారాల ప్రదానం జరగాలని ఆకాంక్షించారు.
కీర్తి పురస్కారాల ప్రదానోత్సవానికి అమాత్యులు రాకున్నా వారి స్థానంలో సినారె చేతుల మీదుగా పురస్కారాల స్వీకరణను పవిత్రంగా భావించాలని రమణాచారి అన్నారు. దేశంలో చాలా మంది ఆత్మసంతృప్తి కోసం బతుకుతారని, వీరికి డబ్బు ముఖ్యం కాదన్నారు. సమాజంలో విలువలను కాపాడటానికి, సమాజం పెడదోవ పట్టకుండా నియంత్రించడానికి సాహితీకారులు చొరవ తీసుకోవాలని రమణాచారి సూచించారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఏ లక్ష్యం కోసం పుట్టిందో అదే లక్ష్యం దిశగా వెళుతోందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. తెలుగు కోసం, సంస్కృతి, వికాసం కోసం ప్రభుత్వం ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధమేనన్నారు. ఈ సందర్భంగా సినారె చేతుల మీదుగా కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
పురస్కార గ్రహీతలు వీరే..
జయరాజ్(సృజనాత్మక సాహిత్యం), జి.బి.శంకరరావు(పరిశోధన), జి.ఆర్.మహర్షి(హాస్యరచన), కొండవీటి సత్యవతి (జీవిత చరిత్ర), నందుల సుశీలదేవి(ఉత్తమనటి), రవీందర్రెడ్డి(ఉత్తమ నటుడు), ఘట్రాజు సత్యనారాయణశర్మ (ఉత్తమ నాటక రచయిత), పసల భీమన్న(హేతువాద ప్రచారం), మాష్టార్జీ(గేయ కవిత), చీకోలు సుందరయ్య(వివిధ ప్రక్రియలు), జి.శ్రీకాంత్(పత్రికా రచన), ఎల్.వెంకటేశ్వరరావు(గ్రంథాలయ విజ్ఞానం), దోరవేటి(కథ), గండవరం సుబ్బరామిరెడ్డి(నాటకరంగం), ఈదర గోపీచంద్(సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), సునీల (ఆంధ్ర నాట్యం), ఎస్.ఎం.ప్రాణ్రావు(నవల), కాసుల ప్రతాపరెడ్డి(భాషాచ్ఛందస్సాహిత్య విమర్శ), కుంట ఓదేలు(జానపద కళలు), మైల వరపు శ్రీనివాసరావు(ఆధ్యాత్మిక సాహిత్యం), కె.శ్రీదేవి(సాహిత్య విమర్శ), మడిపల్లి భద్రయ్య(పద్యం), ఎం.కె.రాము (సాంస్కృతిక సంస్థ నిర్వహణ). మహిళాభ్యుదయంలో వి.సంధ్యకు మల్లాది సుబ్బమ్మ పురస్కారం ప్రకటించినా.. హాజరు కాలేదు. జమ్మికోనేటిరావు, వడ్డేపల్లి శ్రీనివాస్, పి.ఎస్.ఎన్.మూర్తి హాజరుకాకపోవడంతో వారి బంధువులకు పురస్కారం అందజేశారు.












Click it and Unblock the Notifications