కెసిఆర్కు మాత్రమే అర్థంకాలేదు: కడియం, దేనికైనారెడీ
అఖిల పక్ష సమావేశం సమయంలో టిడిపి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు రెండు లేఖలు ఇచ్చిందని, ఆ రెండు లేఖలను చూస్తే టిడిపి తెలంగాణకు అనుకూలమనే విషయం అర్థమవుతుందన్నారు. 18 అక్టోబర్ 2008 లేఖ, 27 డిసెంబర్ 2012 లేఖ.. ఇలా రెండు లేఖలు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతకంతో ఇచ్చామన్నారు. కెసిఆర్ సమక్షంలోనే తాను తెలంగాణకు టిడిపి అనుకూలమని చెప్పామన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు టిడిపి తెలంగాణకు అనుకూలమని చెబుతున్నాయని, కెసిఆర్కు మాత్రం అది అర్థం కావడం లేదన్నారు. ఏ రాజకీయ కోణం వల్ల కెసిఆర్కు అర్థం కావటం లేదో తెలియదన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. దానిని బహిరంగంగా ఒప్పుకుంటే తెరాస బలహీనపడుతుందని, తన ప్రభావం తగ్గుతుందనే ఆందోళనతో ఆయన తెలుగుదేశం పార్టీని అంగీకరించకపోయి ఉంటారన్నారు.
షిండేకు ఇచ్చిన లేఖలో టిడిపి తెలంగాణకు అనుకూలమని లేకుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అనుకూలంగా ఉంటే కెసిఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు. అఖిల పక్షం మినట్స్ను కెసిఆర్ మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షిండే రాసుకున్న మినట్స్ తెలంగాణకు వ్యతిరేకమని తేలితే దేనికైనా రెడీ అన్నారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని కూడా తాము డిమాండ్ చేశామన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరి చెప్పి టిడిపిని ప్రశ్నించాలన్నారు.
తెలంగాణ కాంగ్రెసు నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తెరాస కనుసన్నుల్లో నడుస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నెల రోజుల ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపించాలన్నారు.