న్యూ ఇయర్లోకి మన నేతలు ఇలా ఎంటరయ్యారు!!!
హైదరాబాద్: రాష్ట్రంలో 2012 సంవత్సరం మొత్తం దాదాపు వైయస్ జగన్, తెలంగాణ అంటూ సాగింది! కాంగ్రెసును వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యారు. ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బయటకు రావాలని ఆ పార్టీ నేతలు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఆయన జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెసు, టిడిపి నేతలను మాత్రం తన పార్టీలోకి ఆకర్షించడంలో వెనుకబడలేదు.
జగన్ జైలులో ఉండటంతో ఆ పార్టీ నేతలు కొంత ఆవేదనతోనే 2013లోకి ఎంటర్ అయ్యారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకింత ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అఖిల పక్ష వ్యూహం బెడిసి కొట్టింది. ఓ వైపు తెలంగాణకు అనుకూలంగా ఉన్న టిడిపి రెచ్చిపోతుంటే మరోవైపు మజ్లిస్ను, సిపిఎంను ఎందుకు టార్గెట్ చేయడం లేదని జెఏసి భాగస్వామ్య పక్షాలు నిలదీస్తున్నాయి.
బాబు తనయుడు నారా లోకేష్ సైలెన్స్ బ్రేక్ చేస్తూ... ఓ ఆంగ్లదిన పత్రిక ఇంటర్వ్యూలో తాను రాజకీయాలపై మరింత దృష్టి సారిస్తానని చెప్పారు. ట్విట్టర్లో ఇతర పక్షాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తుండగా... కేంద్రమంత్రి చిరంజీవి లక్ష్యం ఎంత వరకొచ్చిందో తెలియకుండా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు తానే అనే ధీమాతో ముందుకెళ్తున్నారు.

జగన్ జైలులో ఉండటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆనందచాయలు కనిపించడం లేదు. జగన్ బెయిల్ కోసమే వారు ఎదురు చూస్తున్నారు. జగన్ను బయటకు తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ మాత్రం ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలంగాణపై జరిగిన అఖిల పక్ష సమావేశం, అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు జగన్ పార్టీని ఖంగు తినిపించింది! పార్టీలోకి వరుస వలసలు ఆ పార్టీకి ఊరట. న్యూఇయర్ రోజే దర్సి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి ఆ దిశలో సంకేతాలు ఇచ్చారు.

చంద్రబాబు కొంత ఉత్సాహంగానే ఎంటరయ్యారని చెప్పవచ్చు. అఖిల పక్ష సమావేశం తర్వాత తెలంగాణలో టిడిపి దూకుడు పెరిగింది. అదే సమయంలో సీమాంధ్రలో చిన్న చిన్న అసంతృప్తులు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద గతంలో కంటే ఒకింత ధీమాలోనే తెలుగుదేశం ఉంది.

దూకుడు మీదున్న కెసిఆర్కు 2012 సంవత్సరం అఖిలపక్షం పేరుతో పెద్ద షాక్ ఇచ్చింది. ఆల్ పార్టీ తర్వాత టిఆర్ఎస్ దశ మారుతుందనుకుంటే... సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.

2014 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననే ధీమాతో కిరణ్ కుమార్ రెడ్డి 2013లోకి ఎంటరయ్యారు. మార్పులపై ఎంతగా ప్రచారం జరిగినా ఇప్పుడు అవన్నీ తూచ్ అయిపోయాయి! ముఖ్యమంత్రి మాటలను బట్టి 2014పై ఆయనకు పెద్దగా ఆశలు లేనట్లుగా కనిపిస్తున్నాయి.

2014లో కాంగ్రెసు పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వాలన్న బొత్స సత్యనారాయణ ఆశలు ఆవిరయ్యాయనే చెప్పవచ్చు. పదవిపై తనకూ ఆసక్తి ఉందని చెప్పిన బొత్స ఇప్పుడు దానిని వదిలేశారు. 2014లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఆ పార్టీలోనే కనిపించడం లేదనేది బహిరంగ రహస్యం. ఒకవేళ గెలిచినా... కిరణ్ ఆయన ప్రతిష్టను దెబ్బతీశారనే చెప్పవచ్చు.

కేంద్రమంత్రి అయ్యాక చిరంజీవి అరుదుగా కనిపిస్తున్నారు. చిరంజీవి '2014లో ముఖ్యమంత్రి' కోరిక ఎక్కడుందో తెలియదు.

ఇన్నాళ్లూ సైలెన్స్గా ఉన్న నారా లోకేష్ త్వరలో రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు.

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించి జూనియర్ ఎన్టీఆర్ వెనుకబడ్డారు. చివరకు నాలుగైదు నెలల క్రితం తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పి చేతులు దులుపేసుకున్నారు. రెండూమూడుసార్లు అలా మెరిసి.. టిడిపికి మావయ్యకు అండగా ఉంటనని చెప్పి వెళ్తున్నారు. ఇక బావకు అండగా ఉంటాననేది బాలయ్య కామన్ డైలాగ్.

తెలంగాణ ప్రాంత ఎంపీలు అఖిల పక్ష సమావేశం కోసం ఎఫ్డిఐలను ఉపయోగించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో వారు క్రెడిబులిటీ పెంచుకున్నారు.

మంత్రులు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయించారు! మంత్రులేం చేస్తారు... ఇది పలువురు తెలంగాణవాదుల ప్రశ్న. ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెసు పైన ప్రధానంగా టి-మంత్రుల పైన పడింది. వారిపై ఒత్తిడి తెచ్చేందుకు జెఏసి సమాయత్తమవుతోంది. మంత్రులు ఈ రోజే ప్రణబ్ను కలిసి తమ తెలంగాణ ఆకాంక్షను వివరించారు.

విభజనపై విపక్ష తెలంగాణ నేతలు ఆశలు పెట్టుకోలేదు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ధీమాతో ఉన్నారు. అదే సమయంలో సీమాంధ్రలో అధికార నేతలు విభజన జరగదని బల్ల గుద్ది చెబుతున్నారు. కానీ విపక్ష నేతలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఉన్నదనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
అఖిల పక్షం తర్వాత తెలంగాణ కాంగ్రెసు నేతలు విభజనపై ఆశలు పెట్టుకుంటే.. అదేం లేదని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అంటున్నారు. విపక్షాల తీరు ఇందుకు భిన్నంగా ఉంది. కేంద్రం నెలలో తెలంగాణను తేలుస్తుందంటే తాము నమ్మటం లేదని బిజెపి, సిపిఐ, తెరాస, టిటిడిపి నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సీమాంధ్ర టిడిపి, వైయస్సార్ కాంగ్రెసులో మాత్రం ఏదో జరగవచ్చుననే ఆందోళన కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications