న్యూ ఇయర్ వేడుకల విషాదం: పలువురు మృతి
హైదరాబాదు నగరంలో మోటార్ సైకిల్పై నుంచి పడి ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఫ్లైఓవర్లను పోలీసులు మూసేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయినా, వేడుకల సందర్భంగా పెద్ద యెత్తున యువకులు బయటకు వచ్చారు. వందలాది మంది బయటకు వచ్చి వేడుకలను జరుపుకున్నారు.
చాలా మోటార్ సైకిళ్లపై ముగ్గురేసి ప్రయాణించారు. కార్లు వేగంగా దూసుకుపోయాయి. పోలీసులు డజన్ల కద్దీ కేసులు పెట్టారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కడప జిల్లాలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కేక్ను పట్టుకుని మెటార్ సైకిల్పై వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు.
రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ వద్ద ట్రక్కు మోటార్ సైకిల్ను మంగళవారం తెల్లవారు జాము ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మరణించారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలోనే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. రంగా రెడ్డి జిల్లా తాండూరు వద్ద టూ వీలర్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ను ఢీకొని పడిపోయింది. ఈ సమయంలో మోటార్ సైకిల్పై నుంచి పడిపోయిన ఇద్దరి పైనుంచి ఫోర్ వీలర్ దూసుకుని వెళ్లింది.
మరిన్న ప్రమాదాలు కూడా సంభవించాయి. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వద్ద రెండు టూవీలర్లు ఢీకొన్ని ఇద్దరు యువకులు మరణించారు. వరంగల్లో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు టూవీలర్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో మిత్రుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకతను మరణించాడు.