నిద్రపోం.. వారిని పోనివ్వం, వెంటపడతాం: కోదండరామ్
మేమే పోరాడి కచ్చితమైన సానుకూల ప్రకటన తెచ్చుకుంటామన్నారు. కేంద్రం విధించుకున్న నెల గడువు కూడా తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నదేనన్నారు. అఖిలపక్ష భేటీలో తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. నెలలో కాంగ్రెస్, యుపిఏ స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని, రాష్ట్ర ఏర్పాటు రూట్ మ్యాప్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మేం నిద్రపోం.. వారిని నిద్ర పోనివ్వమన్నారు. గడచిన మూడేళ్ల ఉద్యమం ఒక ఎత్తు అయితే, ఈనెల రోజుల ఉద్యమం ఒక ఎత్తు అన్నారు. అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు స్పష్టమైన వైఖరి చెబితే కాంగ్రెస్పై ఒత్తిడి పెరిగేదని, కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా గోడ మీద పిల్లివాటంగా మోసపూరిత వైఖరి ప్రదర్శించిందని, తెలుగుదేశం పార్టీ వైఖరిలోనూ స్పష్టత లేదని, అవకాశవాదమే ఉందన్నారు.
తెలంగాణ ప్రకటించాలని అనలేదని, 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటామని చెప్పలేదని, లేఖకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రానికి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెడితే కచ్చితంగా అనుకూల ప్రకటన వచ్చేదన్నారు. ప్రతిపక్షాలు కూడా కేంద్రం, కాంగ్రెస్పై ఒత్తిడికి కార్యాచరణతో కదలాలని కోరారు.
వచ్చే నెల రోజుల్లో జెఏసి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను కోదండరామ్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ బాధ్యత తెలంగాణ మంత్రులపైనే ఉందని, వారు ఢిల్లీపై ఒత్తిడి తీసుకురావాలనే డిమాండ్తో మంత్రుల నియోజకవర్గాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో రసమయి బాలకిషన్ ధూం ధాం కార్యక్రమాలు నిర్వహిస్తారని, యూపిఏ భాగస్వామ్య పక్షాలను కలిసి తెలంగాణకు మద్దతు ఇవ్వాలని ఉత్తరాలు అందజేసి ఒత్తిడి తెస్తామని తెలిపారు.
ఢిల్లీలో ధర్నా ఉంటుందని, కేంద్రానికి హెచ్చరికగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. భాగస్వామ్య పార్టీలు చేపట్టే ఆందోళనలకు జెఏసి మద్దతు ఉంటుందన్నారు.