మళ్లీ రోజా యాక్టివ్, మాట్లాడనన్న మోహన్ బాబు

వచ్చే ఎన్నికల్లో నగరి శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కూడా గత కొంత కాలంగా ఆమె చురుగ్గా పాల్గొనడం లేదనే వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె నియమితులయ్యారు. అయితే, అంతకు ముందు మీడియా ముందుకు పదే పదే వచ్చిన రోజా కొంత కాలంగా అంత చురుగ్గా ముందుకు రావడం లేదు.
మహిళా సమస్యలపై అంతకు ముందు తాను చురుగ్గా పనిచేశానని, మహిళల్లో చైతన్యం తేవడానికి మళ్లీ కార్యక్రమాలు చేపడుతానని ఆమె చెప్పారు. గతంలో కాలేజీల్లో చర్చాగోష్టులు నిర్వహిస్తామని ఆమె అన్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆమె అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని, దోషులకు కఠిన శిక్షలు ఉంటే నేరాలు చేయడానికి భయపడుతారని ఆమె టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
దుర్మార్గాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలు పనిచేయాలని, సంఘటనలు జరిగినప్పుడే మాట్లాడి ఊరుకోకూడదని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆమె బెల్టు షాపుల వంటివాటిపై చురుగ్గా ఆందోళనలు చేపట్టారు. ప్రజల్లోకి చొచ్చుకుని పోయారు. వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చిన తర్వాత ఆమె కాస్తా స్తబ్దంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు. కొన్ని టీవీ షోలకు ఆమె యాంకర్గా కూడా పనిచేస్తున్నారు.
కాగా, ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. తనకు అన్ని పార్టీలూ కావాల్సినవేనని అన్నారు. ఆయన బుధవారంనాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ను సచివాలయంలో కలిశారు. ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల ఫీజుపై వినతిపత్రం సమర్పించారు. అధికారులు సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు. ఈ సమయంలో తాను రాజకీయాల గురించి మాట్లాడబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications