వైయస్ పాదయాత్ర రికార్డ్ అధిగమించిన బాబు

తెరిపి లేని నడక వల్ల చంద్రబాబు కండరాలపై ఒత్తిడి పెరుగుతోందని, దానివల్ల ఆయన త్వరగా అలసిపోతున్నారని అంటున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించే సమయంలో నొప్పిని పళ్ల బిగువుతో అణచిపెట్టుకుంటూ కొన్ని సందర్భాల్లో ఒంటికాలిపై కూడా నిలబడుతున్నారు. రోజుకు మూడు సార్లు డాక్టర్ భరత్ నేతృత్వంలోని వైద్యులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో భార్య భువనేశ్వరితో పాటు కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి బుధవారం చంద్రబాబును వరంగల్ జిల్లాకు వచ్చి పరామర్శించారు. మధ్యలో పాదయాత్రను ఆపడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఆయన పాదయాత్ర త్వరలో 1500 కిలోమీటర్లు దాటారు. ఖమ్మం జిల్లాలోకి చేరుకునే సరికి వంద రోజులకు చేరుతుంది.
పాదయాత్ర వంద రోజులు సాగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నెల 26వతేదీన పాదయాత్రను కొనసాగించే విషయంపై ఖమ్మం బహిరంగ సభలో చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. నిజానికి ఆయన పాదయాత్ర జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ముగియాల్సి ఉంది. అయితే, కోస్తాలో కూడా పాదయాత్ర సాగించాలనే ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతోంది. దీంతో ఖమ్మం బహిరంగ సభలో కోస్తా పాదయాత్రపై ఆయన ప్రకటన చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురంలో అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఆయన సుదీర్ఘంగా నడక సాగించి వరంగల్ జిల్లా చేరుకున్నారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు.
వైయస్ పాదయాత్ర రికార్డ్ బ్రేక్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర రికార్డును బ్రేక్ చేశారు. 2003 వైయస్ 1468 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. చంద్రబాబు ఈరోజు దానిని అధిగమించారు. దస్రూనాయక్ తండాలో చంద్రబాబు ఈ రికార్డ్ అధిగమించారు.












Click it and Unblock the Notifications