మఠం కాదు, పార్టీ: తండ్రి కరుణానిధిపై అళగిరి ఫైర్
తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ పేరును సూచిస్తూ కరుణానిధి చెన్నైలోని ఓ కార్యక్రమంలో గురువారం మాట్లాడిన విషయం తెలిసిందే. డిఎంకెలో చాలా కాలంగా స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వ పోరు జోరుగా సాగుతోంది. స్టాలిన్ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు చూస్తుండగా, ఆయన అన్న అళగిరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. స్టాలిన్ తర్వాతనే అళగిరి రాజకీయాల్లోకి వచ్చారు.
డిఎంకె శంకర మఠం కాదని కరుణానిధి గతంలో చేసిన ప్రకటనను అళగిరి గుర్తు చేశారు. స్టాలిన్ను తప్ప మరొకరికి వారసత్వాన్ని అప్పగించే స్థితిలో 88 ఏళ్ల కరుణానిధి లేరు. ముఖ్యమంత్రి జయలలితను ఎదుర్కోవడానికి కూతురు కనిమొళి పనికి వస్తారని భావించినప్పటికీ ఆమె 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ఇరుక్కున్నారు. జయలలితను ఎదుర్కోవడంలో స్టాలిన్ దీటుగానే వ్యవహరిస్తున్నారు.
అళగిరి రాష్ట్రవ్యాప్త ప్రతిష్టను పెంచుకోలేకపోయారు. పైగా అళగిరి కుమారులు కుంభకోణాల్లో చిక్కుకున్నారు. మధురై కింగ్గా పేరు పొందిన అళగిరి తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించక తప్పకపోవచ్చు.