అక్బర్ హిందూకు అసద్ తెలంగాణ తోడు: తెరాస దూకుడు
ముషీరాబాద్ చౌరస్తాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అక్బర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మజ్లిస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని, భేషరతుగా అక్బర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు హిందూ పీఠాధిపతులు, స్వామీజీలు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను భారత సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు.
ఇంకా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అక్బర్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగానే రంగారెడ్డి జిల్లా తాండూరులో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెరాస ఘాటుగా మజ్లిస్పై స్పందించడం గమనార్హం. ఓవైసీ సోదరులు రజాకార్లకు వారసులుగా వ్యవహరిస్తున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువులకు వ్యతిరేకం కాదంటున్న వారు భాగ్యలక్ష్మి దేవాలయం అంశాన్ని ఎందుకు వివాదం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బాబ్రీ మసీదును కూల్చిన వారిపై కేసులు పెట్టలేదన్న అంశాన్ని వారు ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ను ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించడమనే సరైన శిక్ష అని టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాము హిందువులకు వ్యతిరేకం కాదని చెప్పడం విడ్డూరంగా ఉందని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. మజ్లిస్ పార్టీకి రాజకీయ అజెండా లేదన్నారు. అసద్ ఎప్పుడైనా హిందువుల సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు తన సోదరుడు, మజ్లిస్ శాససనభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను సమర్థించినట్లుగా ఉన్నాయని బండారు దత్తాత్రేయ విమర్శించారు.
తెలంగాణ ఇప్పట్లో రాకుండా చేస్తామన్న అసద్ వ్యాఖ్యల పైన తెలంగాణవాదులు మండిపడ్డారు. తెలంగాణ అసద్ చేతుల్లో లేదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని చెప్పేందుకు ఆయనెవరు అన్నారు. తాము మరోసారి తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్తామని, తమకు పదవులు, ప్యాకేజీలు ఏవీ వద్దని తెలంగాణ మాత్రమే కావాలన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును పదేళ్లు ఉంచినా అభ్యంతరం లేదన్నారు. జానా రెడ్డి ఢిల్లీ పెద్దల్ని కలిశారని ఆయన చెప్పారు.
మతం పేరుతే మజ్లిస్ పార్టీను ఉపయోగించుకొని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని తెరాస ఎమ్మెల్యే కెటి రామారావు అన్నారు. జగన్, అక్బరుద్దీన్లు కలిసి నాటి సంఘటనలు పునరావృతం చేయాలని చూస్తున్నారని, అదే అయితే ప్రజలు ఛీకొడతారన్నారు. మజ్లిస్ మత విద్వేషాలు రెచ్చగొట్టి పాతబస్తీలో పబ్బం గడుపుకుంటోందని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.
మజ్లిస్ వెంట ముస్లింలు ఎవరూ లేరన్నారు. అసద్ చెబితే తెలంగాణ ఆగదని, ఆపాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. మజ్లిస్ పైన తెరాస తెలంగాణ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ విమర్శించింది. తెలంగాణలోని ముస్లింలు అందరూ తెలంగాణ కోరుకుంటున్నారని, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వద్దన్నంత మాత్రాన ఆగదన్నారు. వద్దని చెప్పేందుకు అసద్ ఒక్కడై మైనార్టీ కాదన్నారు. తెలంగాణ కోరుకుంటున్న ఈ ప్రాంత ముస్లింలందరూ మైనార్టీలే అన్నారు.