తెలంగాణ రానివ్వం!, నెలలో కిరణ్ ఇంటికి: అసదుద్దీన్
అక్బర్ లొంగిపోతాడని, చట్టాన్ని తాము గౌరవిస్తామని, నిర్దోషిగా నిరూపించుకుంటామని చెప్పారు. తమ వ్యతిరేకత హిందువుల పైన కాదని, కేవలం భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల పైనే అన్నారు. నెల రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను నిషేధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇప్పట్లో రానిచ్చే ప్రసక్తి లేదన్నారు.
అక్బరుద్దీన్పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరమే లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇప్పట్లో రానివ్వబోమని ప్రకటించారు. కిరణ్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రజలపై మోయలేని భారం మోపుతున్న ముఖ్యమంత్రి వచ్చేనెలలో రాజకీయంగా లేవలేని స్థితిలో ఇంట్లో కూర్చుంటారన్నారు. రెండేళ్లలో కిరణ్ ప్రజలపై రూ.4,500కోట్ల భారాన్ని మోపారని వచ్చే, ఫిబ్రవరి నాటికి అది 8వేల కోట్లకు పెరుగుతుందని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి తర్వాత రోజుకు 14 గంటల విద్యుత్ కోత ఉంటుందని అసదుద్దీన్ పేర్కొన్నారు. బిజెపితో కిరణ్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాతే తమపై కేసులు పెడుతున్నారన్నారు. ముంబై ముట్టడి కేసులో ఉగ్రవాది కసబ్ను ఉరితీస్తే ఎంఐఎం స్వాగతించిందన్నారు.
పాకిస్థాన్తో సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూనే... ముంబై ముట్టడి నిందితులను భారత్కు అప్పగించాలనే షరతు విధిస్తున్నామన్నారు. టీవీ స్టూడియోలు కోర్టు రూములుగా మారాయని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. టీవీ చర్చల వల్ల ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మహిళలపై అత్యాచారాల నిరోధానికి కఠినమైన చట్టాలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.