అక్బర్ది తప్పే కానీ: మైసూరా, పాతచింతకాయ..డిజిపి
అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సరైనవి కానప్పటికీ వాటిని ఉపయోగించుకొని కొందరు లబ్ధి పొందాలని చూడటం మాత్రం సరికాదన్నారు. అక్బరుద్దీన్, చంద్రబాబు, కెటిఆర్.. ఇంకెవరైనా ఒక మతాన్ని దూషించడం తప్పన్నారు. అయితే కొందరు వారి వారి పార్టీల మనుగడ కోసం ఇతర పార్టీలపై బురద జల్లడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను సన్మార్మంలో నడిపించాలన్నారు.
అక్బర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని అయితే, అధికారంలో ఉన్నవారు ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసుతో పొత్తు ఉంటే ఓరకంగా లేకుంటే మరోరకంగా వ్యవహరిస్తున్నారని ఇది సరికాదన్నారు. ఏ పార్టీనైనా మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని భావించడం సరికాదన్నారు. బిజెపి, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మతతత్వ పార్టీలు అని చంద్రబాబు అంటున్నారని, ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నప్పుడు బాబుకు ఆ విషయం తెలియదా అని ప్రశ్నించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషన్ పైన ప్రతివాదనలు చేయడానికి న్యాయవాదులు అందుబాటులో లేరని సిబిఐ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. సిబిఐ దర్యాఫ్తు రాజకీయ జోక్యంతోనే జరుగుతోందనడానికి ఇదే మంచి నిదర్శనం అన్నారు. సిబిఐ, ఈడి రెండూ రాజకీయ ఒత్తిడితోనే పని చేస్తున్నాయని ఆరోపించారు. బాబు కాంగ్రెసుతో మిలాకత్ అయి కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు.
పాతచింతకాయ పచ్చడి
అక్బరుద్దీన్ కేసు పాత చింతకాయపచ్చడి అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్ రెడ్డి బుధవారం వేరుగా అన్నారు. భారతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో జాతీయ మహిళల హాకీ పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆయన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ కేసు గురించి అడిగితే ఆ కేసు పాత చింతకాయ పచ్చడి అన్నారు. అది పాత విషయంగా కొట్టిపారేశారు.