డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ బస్సు ఛార్జీల భారం.. టీజీఎస్ ఆర్టీసీ చెప్పిందిదే!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లోనే నాలుగు సార్లు ధరలు పెరిగాయి. మళ్ళీ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం ఆర్టీసీ బస్సులపైన కూడా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో టీజీఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల భారాన్ని పెంచకూడదనే ఉద్దేశంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
టీజీఎస్ఆర్టీసీ పరిధిలో ప్రస్తుతం 10,130బస్సులు
టీజీఎస్ఆర్టీసీ రోజుకు సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తుంది. ధరల పెరుగుదల వల్ల రోజుకు రూ.36 లక్షలు, నెలకు రూ.10 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడుతోంది.టీజీఎస్ఆర్టీసీ పరిధిలో ప్రస్తుతం 10,130 బస్సులు నడుస్తున్నాయి. లీటర్ డీజిల్ ధరలో ఒక్క రూపాయి పెరిగినా నెలకు రూ.1.28 కోట్ల అదనపు ఖర్చు వస్తుందని అంతర్గత లెక్కలు చెబుతున్నాయి.

నెలకు రూ.7.68కోట్ల నుంచి రూ.12కోట్ల వరకు భారం పడే అవకాశం
ఇప్పటికే లీటర్కు రూ.6 వరకు పెరిగినందున నెలకు రూ.7.68 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచి ప్రస్తుత ఛార్జీలను అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో కూడా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై భారం మోపకుండా సంస్థ స్వయంగా నష్టాన్ని భరించాలని నిర్ణయం తీసుకుంది.
పెంపుపై టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ
అధికారులు ఇరాన్ సంక్షోభం తగ్గి ఇంధన ధరలు స్థిరపడిన తర్వాత మాత్రమే ఛార్జీల సవరణపై ఆలోచించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి పెంపు ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం ప్రయాణికులకు పెద్ద ఉపశమనంగా మారింది. ఈ కష్టకరమైన పరిస్థితుల్లో కూడా టీజీఎస్ఆర్టీసీ ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వటం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనం
రాష్ట్రంలోని లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులు తెలంగాణా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనం పొందనున్నారు. టీజీఎస్ఆర్టీసీ ఈ విధంగా ప్రజల పక్షాన నిలబడడం రవాణా రంగంలో సానుకూల సందేశం అందిస్తోంది. భవిష్యత్తులో ఇంధన ధరలు ఎలా మారతాయో చూసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications